PEN POWER
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 3:17 pm Posted By : D Ratnam

మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది

ఐదు కిలోమీటర్లు డోలి మోసుకు వచ్చిన108 సిబ్బంది బంధువులు

వై రామవరం, పెన్ పవర్, ఏప్రిల్ 5 : చెట్టు నుండి పడిన వ్యక్తి గాయపడిన సమాచారం తెలియగానే హుటా హుటిన సంఘటన స్థలానికి కాలినడకన చేరుకున్న 108 సిబ్బంది ప్రధమ చికిత్స అందించిన సేవలు ప్రశంసనీయమని పలువురు కొనియాడుతున్నారు.
వివరాల్లోనికి వెళితే వై.రామవరం మండలం పి.ఎర్రగొండ పంచాయతీ తాడికోట గ్రామానికి చెందిన చోళ్ళ చిన్నారెడ్డి(20) చెట్టు నుండి పడి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర డోలి కట్టుకొని 108 సిబ్బంది సహకారంతో గ్రామస్తులు అంబులెన్స్ వరకు ఏడు వాగులు దాటుకొని క్షత గాత్రుని మోసుకుని వచ్చారని తెలిపారు. ఆపద కాలంలో ఆదుకునే 108 భవ్య హెల్త్ సర్వీస్ సంస్థ ఎప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడే దృక్పథంతో పనిచేస్తుందనడానికి ఇదే నిదర్శనం అని పలువురు కొనియాడుతున్నారు. పైలట్ నవాజ్, ఈఎంటి వెంకట్ గ్రామస్తులు సహకారంతో అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు.