PEN POWER
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 6:43 pm Posted By : M CHANTI BABU

ముఖ హాజరు కోసం ఉపాధి వేతనదారుల పాట్లు

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్‌ 20: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న వేతనదారులు ‘ముఖ హాజరు’ నమోదు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం అమ్మవారి దారకొండ గ్రామానికి చెందిన గిరిజనులు ఈ సమస్యపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామానికి దూరంగా ఉన్న కొండప్రాంతాల్లో పనులు నిర్వహిస్తున్న కార్మికులు ఉదయం యాప్‌ ద్వారా ముఖ హాజరు నమోదు చేసుకున్నప్పటికీ, మధ్యాహ్నం హాజరు నమోదు కాకపోవడంతో గంటల తరబడి అక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సాంకేతిక సమస్యల కారణంగా హాజరు నమోదు కాకపోతే, చేసిన పనికి వేతనం రాకపోతుందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.కొండప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్యలు, సాంకేతిక లోపాలు కార్మికులకు మరింత భారంగా మారుతున్నాయని వారు చెబుతున్నారు. రోజంతా కష్టపడి పని చేసినప్పటికీ, హాజరు నమోదు కాలేక వేతనం కోల్పోతున్నామని గిరిజన వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.