PEN POWER
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 8:12 am Posted By : M CHANTI BABU

రోడ్డు నిబంధనలు పాటించండి.. సురక్షితంగా గమ్యాన్ని చేరండి:జీకే వీధి ఎస్ఐ సురేష్  

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 20:రహదారి భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జీకేవీధి ఎస్సై సురేష్ సూచించారు. గూడెం కొత్తవీధి మండలం ఆర్వీనగర్ వారపు సంతలో సోమవారం గిరిజనులతో కలిసి రోడ్డు ప్రమాదాలు, మహిళలపై దాడుల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా పాల్గొన్న వారు “రోడ్డు నిబంధనలు పాటించండి – సురక్షితంగా గమ్యానికి చేరండి”, “ప్రమాదాలకు గురై కుటుంబాల్లో విషాదం నింపొద్దు”, “మీ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులను గుర్తుంచుకుని జాగ్రత్తగా ప్రయాణం చేయండి”, “మహిళలు, బాలికలపై దాడులను నివారిద్దాం” వంటి నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రత, వాహన చోదనపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రమాదాలు తగ్గకపోవడం ఆందోళనకరమని అన్నారు. ముఖ్యంగా ఇటీవల యువత రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. రహదారి నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని, సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే మహిళలపై దాడులకు పాల్పడి చట్టపరమైన చర్యలకు గురికాకుండా బాధ్యతతో ప్రవర్తించాలని హెచ్చరించారు.