PEN POWER
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 2:04 pm Posted By : PEN POWER MEDIA

బలమైన వ్యూహాంతో కమలం

కూటములతో బీజేపీ ప్రభావం కొనసాగింపు
టీడీపీ, జనసేనతో వ్యూహాత్మక అనుబంధం
కాంగ్రెస్ బలహీనత బీజేపీకి లాభం
వైసీపీ వైఖరిపై రాజకీయ విమర్శలు
2029పై కమలం దీర్ఘకాల ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ప్రత్యక్ష బలం తక్కువైనా, కూటములు మరియు రాజకీయ సమీకరణలతో కమలం పార్టీ తన స్థానాన్ని బలపరుచుకుంటోంది.

పోలిటికల్ బ్యూరో పెన్ పవర్ విజయవాడ, ఏప్రిల్ 17:

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ప్రత్యక్షంగా బలంగా కనిపించకపోయినా, వ్యూహాత్మకంగా తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రాంతీయ పార్టీలతో అనుబంధాలు కొనసాగించడం ద్వారా కమలం పార్టీ రాజకీయంగా తన స్థానం నిలబెట్టుకుంటోంది.టీడీపీ, జనసేనలతో కూటమి ఏర్పరచుకోవడం ద్వారా బీజేపీ పార్లమెంట్, అసెంబ్లీ స్థాయిలో ప్రాతినిధ్యం సాధిస్తోంది. ఈ కూటమి ద్వారా కేంద్ర రాజకీయాల్లోనూ తన ప్రాధాన్యతను పెంచుకుంటోంది. అదే సమయంలో తెలంగాణలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉండటంతో అలాంటి కూటమి ఏర్పడలేదు.రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం కూడా బీజేపీకి కలిసొచ్చిన అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఏపీలో బీజేపీకి ప్రత్యక్షంగా ఎదురుదాడి చేసే జాతీయ పార్టీ లేకపోవడం, కమలం పార్టీకి అనుకూల పరిస్థితులను సృష్టించింది.ఇక వైసీపీ వైఖరిపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక బిల్లులకు వైసీపీ మద్దతు తెలపడం వల్ల, బీజేపీకి పరోక్షంగా బలం చేకూరుతోందని విమర్శలు వస్తున్నాయి. ఇది రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీకి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.దీంతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి తగిన నిధులు, హామీలు అందడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పోలవరం వంటి కొన్ని ప్రాజెక్టులకు మినహా, మిగతా అంశాల్లో ఆశించిన మద్దతు లేదన్న భావన ప్రజల్లో ఉంది.దీర్ఘకాలంలో బీజేపీ దక్షిణాదిపై దృష్టి సారించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా 2029 ఎన్నికల తర్వాత ఏపీలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కమలం ప్రయత్నాలు చేయవచ్చని భావిస్తున్నారు.