PEN POWER
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 2:00 pm Posted By : PEN POWER MEDIA

కబ్జా కోరల్లో చెరువులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెరువులు, కుంటలు, నాళాలు భారీగా కబ్జాలకు గురవుతుండటంతో వర్షాకాల ముంపు ముప్పు మళ్లీ పొంచి ఉంది. నాలుగు వేలకు పైగా నీటి వనరుల్లో వెయ్యికి పైగా అధిక విస్తీర్ణంలో ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.FTL, బఫర్ జోన్‌లలో నిర్మాణాలు పెరగడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి వరద ముప్పు పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత ఏడాది భారీ వర్షాల్లో వరంగల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకున్న ఘటనలు ఇంకా మరిచిపోలేదు.ఇప్పటికైనా ప్రత్యేక యంత్రాంగంతో చెరువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

  • ఉమ్మడి వరంగల్‌లో చెరువులపై కబ్జాల ముప్పు
  • FTL, బఫర్ జోన్‌లలో అక్రమ నిర్మాణాల విస్తరణ
  • వర్షాకాలంలో ముంపు ముప్పు మళ్లీ పెరుగుతోంది
  • రైల్వే ట్రాక్‌లకూ చెరువుల ఆక్రమణల ప్రభావం
  • హైడ్రా తరహా ప్రత్యేక సంస్థ కోసం ప్రజల డిమాండ్

వరంగల్ | పెన్ పవర్ | ఏప్రిల్ 3:

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, నాళాలు భారీగా ఆక్రమణలకు గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నాలుగు వేలకు పైగా చెరువులు, కుంటలు ఉండగా, వాటిలో వెయ్యికి పైగా నీటి వనరులు అక్రమ నిర్మాణాలు, సాగు ఆక్రమణలు, నాళాల మూసివేత కారణంగా కుంచించుకుపోతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో చెరువుల FTL (Full Tank Level), బఫర్ జోన్లను దాటి నిర్మాణాలు చేపడుతుండటం తీవ్ర సమస్యగా మారింది. వర్షపు నీరు చెరువుల్లోకి చేరే నాళాలు కూడా కబ్జాలకు గురవడంతో, నీటి నిల్వ సామర్థ్యం తగ్గి వరద నీరు నేరుగా కాలనీల్లోకి చేరుతున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో HYDRAA ఫెన్సింగ్, FTL సర్వేలు చేపడుతున్న తరహాలో వరంగల్‌లో కూడా ఇలాంటి చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. గత ఏడాది భారీ వర్షాల సమయంలో వరంగల్ నగరంలోని అనేక కాలనీలు రోజుల తరబడి జలదిగ్బంధంలో చిక్కుకోవడానికి చెరువుల ఆక్రమణలే ప్రధాన కారణమని ప్రజలు చెబుతున్నారు. రహదారులు, రైల్వే ట్రాక్‌లు కూడా వరద నీటిలో మునిగిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.ప్రత్యేకంగా కాజీపేట–డోర్నకల్, కేసముద్రం–ఇంటికన్నె రైల్వే సెక్షన్లలో చెరువులు తెగిపోవడం, నాళాలు మూసుకుపోవడం వల్ల ట్రాక్‌లపై వరద నీరు చేరి రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు కలిసి FTL–బఫర్ జోన్ జాయింట్ సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్‌లో చెరువుల రక్షణ కోసం ఏర్పాటైన HYDRAA తరహాలో ప్రతి జిల్లాకు ప్రత్యేక చెరువు రక్షణ యంత్రాంగం ఏర్పాటు చేసి, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.