PEN POWER
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 2:38 pm Posted By : PEN POWER MEDIA

అంతర్మథనంలో మాగుంట కుటుంబం..

 

1) వారసుడికి అవకాశం ఇవ్వాలన్న తండ్రి ఆలోచనకు క్షేత్రస్థాయి లెక్కలు అడ్డం
2) ప్రజల్లో పలుకుబడి ఉన్నా యువతలో ఆశించిన స్థాయి గుర్తింపు లేకపోవడం ఆందోళన
3) స్థానికంగా కంటే బెంగళూరులోనే ఎక్కువగా ఉండటం ప్రతికూల అంశంగా మారిన పరిస్థితి
4) ఇంటిపేరు కంటే ప్రజల మధ్య నిత్యం కనిపించే నాయకత్వానికే ప్రాధాన్యం పెరిగిన సంకేతం
5) అంతర్గత అంచనాల్లో బయటపడిన బలహీనతలతో మాగుంట శిబిరంలో మల్లగుల్లాలు

ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి తన కుమారుడిని పోటీకి దింపాలన్న ఆశతో ముందుకు సాగిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇప్పుడు లోలోపల తీవ్ర ఆలోచనలో పడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల నాడి, యువత అభిప్రాయం, క్షేత్రస్థాయి వాస్తవాలు కుమారుడు రాఘవరెడ్డి అవకాశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ | ఒంగోలు| ఏప్రిల్ 10 :

వచ్చే ఎన్నికల్లో తాను కాకుండా తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని బరిలో నిలపాలన్న సంకల్పాన్ని ముందుగానే వెల్లడించిన ఒంగోలు ఎంపీ, తెలుగుదేశం నేత మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రస్తుతం లోలోపల ఆలోచనలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కుటుంబ ఆశలు ఒకవైపు, క్షేత్రస్థాయి వాస్తవాలు మరోవైపు ఉండటంతో నిర్ణయం అంత సులభంగా కనిపించడం లేదు. గత ఎన్నికల సమయంలోనే రాఘవరెడ్డిని ప్రజల ముందుకు తీసుకురావాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, పార్టీ అధినాయకత్వం సూచనలతో ఆ ప్రయత్నం వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ అదే దిశగా అడుగులు పడుతున్నప్పటికీ, స్థానిక రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేవన్న భావన పెరుగుతోంది. ఇటీవల నిర్వహించిన అంతర్గత అంచనాల్లో రాఘవరెడ్డికి ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఆశించిన స్థాయి ఆదరణ కనిపించలేదని తేలినట్టు సమాచారం. ప్రజలతో నిత్యం మమేకమయ్యే నాయకత్వాన్ని కోరుకుంటున్న ఈ తరుణంలో, స్థానికంగా కంటే బయట ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం ఆయనకు ప్రతికూలంగా మారిందని భావిస్తున్నారు.మాగుంట కుటుంబానికి ఒంగోలు ప్రజల్లో చిరకాలంగా మంచి పలుకుబడి ఉన్నప్పటికీ, ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కేవలం కుటుంబ పేరు ఆధారంగా విజయాన్ని సాధించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత రెండు ఎన్నికల అనుభవాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. యువతలో పెరిగిన రాజకీయ చైతన్యం, మారుతున్న ప్రజాభిప్రాయం, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే నాయకత్వానికి పెరుగుతున్న ప్రాధాన్యం — ఈ మూడు అంశాలు ఇప్పుడు రాఘవరెడ్డి అవకాశాలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో మాగుంట కుటుంబంలో తుది నిర్ణయంపై మల్లగుల్లాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.