నర్సీపట్నం, పెన్ పవర్ :
అనకాపల్లిజిల్లా, గొలుగొండ మండలం, కొత్తమల్లంపేటలో బుధవారం ఉదయం సీతారామ లక్ష్మణ స్వామి వార్ల శిలా విగ్రహ మరియు పసిడి కలశ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా స్పీకర్కు వేద పండితులు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య అయ్యన్నపాత్రుడుకు ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు మరియు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం నిర్వహించిన అన్న సమారాధనలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈ వేడుకతో కొత్తమల్లంపేట గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.