PEN POWER
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 6:16 am Posted By : D Ratnam

గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు

 

ఎస్టీ కమిషన్ గ్రీవెన్స్‌లో దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి

గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, మే 30 : పోలవరం జిల్లాలోని గిరిజనుల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి నిబంధనల మేరకు పరిష్కారానికి చర్యలు చేపడతామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి తెలిపారు.శనివారం రంపచోడవరంలోని ఎస్టీ కమిషన్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయనతో పాటు కమిషన్ సభ్యులు గొర్లె సునీత, కాకి లక్ష్మి, కిలో సాయిరాం పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.ఈ సందర్భంగా బొజ్జిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని గిరిజనులకు సంబంధించిన వివిధ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకువస్తే నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మారుమూల గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి అవకాశాలు, వ్యక్తిగత సమస్యలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ముంపు బాధిత గ్రామాలైన మంటూరు, మడిపల్లి, పినికిలపాడు ప్రాంతాల గిరిజనులు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ల్యాండ్ టు ల్యాండ్ పునరావాస ప్రయోజనాలను 50 మంది బాధితులకు అమలు చేయాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు.కార్యక్రమంలో ఓఎస్‌డీ కట్ట సాంబయ్య, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రుక్మాండయ్య, సహాయ గిరిజన సంక్షేమ అధికారి జె. శంభుడు, సూపరింటెండెంట్ బి. కిషోర్, సీఎం ఓ బుడమల మంగిరెడ్డి, చక్రధర్, మడకం వరప్రసాద్ దొర తదితరులు పాల్గొన్నారు.