PEN POWER
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 9:46 pm Posted By : Sathish Bede

గిరిజనేతర నిర్వాసితులకు ఐటిడిఏ చింతూరు కీలక సూచనలు

ఆప్షన్ ఫారమ్‌ల సమర్పణకు చివరి గడువు

చింతూరు, పెన్ పవర్, మే 14:

పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని చింతూరు, కూనవరం మండలాలకు చెందిన 1వ, 2వ డ్రాఫ్ట్ పథకాలలో ఉన్న గిరిజనేతర ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఐటిడిఏ చింతూరు కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు పునరావాసానికి సంబంధించిన ఆప్షన్ ఫారమ్ సమర్పించని కుటుంబాలు రేపటిలోగా తప్పనిసరిగా తమ ఫారమ్‌లను సమర్పించాలని ప్రాజెక్ట్ అధికారి సూచించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని తాడువాయి గ్రామంలో ప్లాట్లు ఎంపిక చేసుకున్న గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలకు త్వరలో లాటరీ విధానం ద్వారా ప్లాట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ నేపథ్యంలో మే 16, 2026 నుండి ఆప్షన్ ఫారమ్‌ల స్వీకరణ పూర్తిగా నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇంకా ఆప్షన్ ఫారమ్ సమర్పించని కుటుంబాలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వెంటనే సంబంధిత అధికారులకు తమ ఫారమ్‌లు అందజేయాలని కోరారు. గడువు ముగిసిన తరువాత ఎటువంటి అభ్యర్థనలు, వినతులు లేదా మార్పుల అభ్యర్థనలు స్వీకరించబడవని అధికారులు హెచ్చరించారు. అలాగే, నిర్ణీత గడువులోగా ఆప్షన్ ఇవ్వని గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలకు ప్రాజెక్ట్ అధికారి నిర్ణయానుసారం ప్రభుత్వ నిర్మాణ ఆప్షన్ కేటాయించబడుతుందని తెలిపారు. అనంతరం వచ్చే ఫిర్యాదులు లేదా అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోబడవని వెల్లడించారు. పునరావాస ప్రక్రియ సజావుగా సాగేందుకు సంబంధిత కుటుంబాలు వెంటనే స్పందించి తమ ఆప్షన్ ఫారమ్‌లు సమర్పించాలని ఐటిడిఏ చింతూరు విజ్ఞప్తి చేసింది.