కాజులూరు, పెన్ పవర్ మే 1:
కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం ధనలక్ష్మి పేట గ్రామంలో మేడే పండుగను పురస్కరించుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. “అంబేద్కర్ అందరివాడు” అనే సందేశాన్ని ప్రధానంగా ఉంచుకుని కార్యక్రమం సాగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా పెనుమల్ల సుధీర్ హాజరై అంబేద్కర్ జీవితం, ఆశయాలపై సవివరంగా ప్రసంగించారు.
బాల్య దశలో ఆయన ఎదుర్కొన్న సామాజిక వివక్షలను వివరించి, సమానత్వం కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. సమసమాజ నిర్మాణం కోసం మానవత్వం కీలకమని, మనుషుల్లో సమాన భావన పెరిగితేనే అసమానతలు తొలగిపోతాయని పేర్కొన్నారు.అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా కార్మికులు, మహిళల కోసం అనేక హక్కులను సాధించారని, ఆయన ఆలోచన విధానమే దేశానికి మార్గదర్శకమని అభిప్రాయపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, ప్రపంచ మేధావిగా అంబేద్కర్ సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా అభ్యుదయ యూత్ సభ్యులు, గ్రామస్తులు, ఉద్యోగస్తులు, అంబేద్కర్ వాదులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి భారీ గజమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం యువకులు, మహిళలు, చిన్నారులు ఆటపాటలతో సందడి చేస్తూ భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించిన అంబేద్కర్ శాంతి ర్యాలీ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యుత్ దీపాలతో అలంకరించిన అంబేద్కర్ రథాన్ని గొల్లపాలెం వీధులలో ఊరేగించారు. డీజే సౌండ్స్ మధ్య అంబేద్కర్ పాటలు వినిపించగా యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నెల్లి బ్రహ్మాజీ, పోతుల గనిరాజు, డిఎస్పి జిల్లా అధ్యక్షులు మాత సుబ్బు బాయ్ , బుల్లెట్ రాజు, ప్రత్తిపాటి బుల్లి రాజు, కూటి రంజిత్ కుమార్, పుట్టి అప్పారావు మాస్టారు, రొక్కాల సత్తిబాబు,జర్నలిస్ట్ దడాల ఏడుకొండలు, ధనలక్ష్మి పేట అభ్యుదయ యూత్ సభ్యులు, ఉద్యోగస్తులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.“అంబేద్కర్ అందరివాడు… సమానత్వమే ఆయన సందేశం” అంటూ కార్యక్రమం ఉత్సాహంగా ముగిసింది.