చింతూరు, పెన్ పవర్ మే 4:
చింతూరు మండలానికి సంబంధించిన ఫేజ్–1బి సప్లిమెంటరీ డ్రాఫ్ట్ స్కీమ్స్ను ఐ.టి.డి.ఏ., చింతూరు డివిజన్ అధికారులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ పరిధిలో 41.15 కాంటూర్ స్థాయి కింద ప్రభావితమైన ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, పునరుద్ధరణ (ఆర్ అండ్ ఆర్ ) చర్యల భాగంగా ఈ స్కీమ్స్ రూపొందించబడినట్లు తెలిపారు. ఈ స్కీమ్స్లో చింతూరు, మల్లేతోట, ఏ.జి. కొడేరు, ఉల్లుమూరు, చూటూరు గ్రామాలకు చెందిన ఎస్.టి మరియు నాన్ ఎస్.టి నిర్వాసిత కుటుంబాల వివరాలు చేర్చబడ్డాయి. వీరిని ఆర్ అండ్ ఆర్ ప్రయోజనాలకు అర్హులుగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, జాబితాలో పేర్లు ఉన్న నాన్ ఎస్.టి లబ్ధిదారులు మాత్రమే తమ ఆప్షన్ ఫారమ్స్ సమర్పించాల్సి ఉంటుందని, ఎస్.టి లబ్ధిదారులకు ప్రస్తుతం ఫారమ్స్ సమర్పణ అవసరం లేదని స్పష్టం చేశారు. నాన్ ఎస్.టి లబ్ధిదారులు తమ పేర్లు జాబితాలో పరిశీలించుకొని, అవసరమైన పత్రాలతో ఆప్షన్ ఫారమ్స్ను చింతూరు తహసీల్దార్ కార్యాలయంలో మే 4 నుండి మే 10 వరకు కార్యాలయ సమయాల్లో సమర్పించాలని సూచించారు. ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉన్నట్లయితే నిర్ణీత గడువులోపే తహసీల్దార్ కార్యాలయానికి తెలియజేయవచ్చని తెలిపారు. గడువులోపు ఫారమ్స్ సమర్పించి పునరావాస ప్రయోజనాలను పొందాలని అర్హులైన నాన్-ఎస్.టి లబ్ధిదారులను ప్రాజెక్ట్ అధికారి కోరారు.