డ్రైవర్, క్లీనర్ సురక్షితం. కేసు నమోదు
చింతూరు, పెన్ పవర్, మే 19:
బొడ్డుగూడెం గ్రామం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున డీసీఎం వ్యాన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చింతూరు సీఐ గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన అర్జుని డొంగార రావు డ్రైవర్గా, సుదిమా ఠాకూర్ క్లీనర్గా పనిచేస్తున్నారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా ఐఎఫ్జీఎల్ రిఫ్రాక్టరీ సంస్థకు ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా ఐఎఫ్జీఎల్ రిఫ్రాక్టరీస్ నుంచి ఐరన్ క్లెన్సింగ్ మెటీరియల్ అనే రసాయన పొడిని డీసీఎం వ్యాన్ (కేఏ 15 ఏ 9951) లో లోడ్ చేసుకుని ఈ నెల 16న ప్రయాణం ప్రారంభించారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో చింతూరు మండలం బొడ్డుగూడెం గ్రామానికి సమీపంలోకి రాగానే వ్యాన్ ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే వాహనం నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే కొద్ది సేపటికే మంటలు వ్యాన్ మొత్తం వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది కూనవరం నుంచి ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై డ్రైవర్, క్లీనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చింతూరు సీఐ గోపాలకృష్ణ తెలిపారు.