జిల్లాలో 6 కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం
గంగవరం, పెన్ పవర్, మే 22:
పోలవరం జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షల నిర్వహణలో భాగంగా రంపచోడవరం స్ట్రాంగ్ రూం నుంచి రంపచోడవరం, అడ్డతీగల, కూనవరం, చింతూరు పోలీస్ స్టేషన్లకు ప్రశ్నపత్రాలను భద్రతా నిబంధనల మధ్య శుక్రవారం తరలించినట్లు ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరావు తెలిపారు.జిల్లాలో అడ్డతీగల, చింతూరు, రంపచోడవరం, నరసింహాపురం, కూనవరం ప్రాంతాల్లో మొత్తం ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు.ఈ నెల 25వ తేదీ నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమై వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగనున్నాయని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జిలాని తదితర అధికారులు పాల్గొన్నారు.