జి.మాడుగుల,పెన్ పవర్, మే (06)జి.మాడుగుల మండలం, జాతీయ రహదారి 516-ఈ వంజరి ఘాట్ మార్గంలో ములక్కాయపుట్టు గ్రామ సమీపంలో బ్రేకులు ఫెయిల్ అయి అదుపుతప్పి బోల్తా పడింది ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. జి.మాడుగుల నుంచి ప్రయాణికులతో తాజంగి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘాట్ మార్గంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనాన్ని అదుపుచేసేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అప్పటికి వాహనం ఆగకపోవడంతో పక్కనున్న మట్టి రోడ్ వైపు వాహనాన్ని మళ్ళించాడు. ఆ సమయంలో ఎదురుగా ఉన్న బండరాయిని ఢీకొని అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జి.మాడుగుల మండలం బూసిపల్లి గ్రామానికి చెందిన జి.చంద్రమ్మ, సోలభం సచివాలయం-2 ఏ.ఎన్.ఏం ఈశ్వరమ్మ, జి.మాడుగుల చెందిన ఈశ్వరి, ములక్కాయపుట్టు గ్రామానికి చెందిన కిలో వినోద్ కుమార్, లాజర్, పెడకిల్తరి గ్రామానికి చెందిన కృష్ణవేణి, చింతల.దేవి, పెదబయలు మండలం కిండళం గ్రామానికి చెందిన కుముడు నాయుడు, అరకువేలి మండలం మాలివలస గ్రామానికి చెందిన కొర్ర చొంబాల, వంతల భూమిక, కిలో దొంబాయి, వంతల భాగ్యలక్ష్మిలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో చింతపల్లి మండలం తాజంగి ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.