PEN POWER
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 10:59 am Posted By : D Ratnam

యువతకు నైపుణ్యాభివృద్ధి – ఉపాధి లక్ష్యంగా జిల్లా స్కిల్ కమిటీ ఏర్పాటు

 

15 శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన కలెక్టర్ కె. దినేష్ కుమార్

గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, మే 21 :
పోలవరం జిల్లాలో యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు జిల్లా స్థాయిలో జిల్లా స్కిల్ కమిటీ( డీఎస్సీ) ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ కె. దినేష్ కుమార్ తెలిపారు. వివిధ 15 శాఖల సమన్వయంతో ఈ కమిటీ పనిచేస్తుందని గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.జిల్లాలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కార్యక్రమాల ప్రణాళిక, అమలు, సమీక్ష, పర్యవేక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిటీ సమావేశం నిర్వహించి పురోగతి, లక్ష్యాలు, సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి అధికారి సభ్య కార్యదర్శిగా, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సహ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. అలాగే డి ఆర్ డి ఏ ,జిల్లా పరిశ్రమల కేంద్రం, విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, కార్మిక శాఖ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖలు, ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, కృషి విజ్ఞాన కేంద్రం తదితర శాఖల అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. పరిశ్రమల ప్రతినిధులు, హెచ్‌ఆర్ నిపుణులు, శిక్షణ భాగస్వాములను కూడా చైర్మన్ నామినేట్ చేయనున్నట్లు తెలిపారు.జిల్లా స్కిల్ కమిటీ ద్వారా స్కిల్ ట్రైనింగ్‌లు, జాబ్ మేళాలు, ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లు, స్కిల్ హబ్ కార్యక్రమాలు, పీఎం విశ్వకర్మ, కౌశలం, విదేశీ ఉపాధి కార్యక్రమాల అమలును సమన్వయం చేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో యువతకు అవసరమైన రంగాల వారీ నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, భవిష్యత్ అవసరాలను గుర్తించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు.అన్ని శాఖలు “నైపుణ్యం” వేదిక ద్వారా అవసరమైన డేటా, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల వివరాలను సమన్వయం చేయాలని సూచించారు. యువతకు మెరుగైన శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.