PEN POWER
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 2:40 pm Posted By : Sathish Bede

యువతకు స్ఫూర్తిగా సీఆర్పీఎఫ్ పరిశుభ్రత కార్యక్రమం

చింతూరు, పెన్ పవర్, మే 22:

ప్రకృతి పరిరక్షణతో పాటు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఎ/నలభై రెండు బెటాలియన్ సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో మోతుగూడెం పిక్నిక్ స్పాట్‌లో విస్తృత స్థాయి పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులు పాల్గొని ప్రదేశమంతా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు, ఇతర చెత్తను తొలగించారు. పిక్నిక్ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రపరిచిన అనంతరం అక్కడి సహజ సౌందర్యాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది, యువత కలిసి పర్యాటక ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ ఎల్. చరణ్ తేజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పర్యాటకులు స్థానికులు పిక్నిక్ ప్రాంతాల్లో చెత్త వేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మోతుగూడెం ప్రకృతి అందాలను భావితరాలకు అందించాలంటే ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ఏపీ జెన్‌కో, అటవీ శాఖ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మరియు మీడియా ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక యువతను క్రీడా స్ఫూర్తి, వ్యాయామం, పరిశుభ్రత వంటి సామాజిక కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తూ సీఆర్పీఎఫ్ చేపడుతున్న చర్యలను ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమం ప్రకృతి పరిరక్షణపై మరింత అవగాహన కల్పించిందని స్థానికులు పేర్కొన్నారు.