భట్టిప్రోలు, పెన్ పవర్,మే, 13:
మండలంలోని సూరేపల్లి గ్రామంలో
మండల వ్యవసాయ అధికారి బి బ్రహ్మరెడ్డి అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయంపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యకమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మధు మోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం మధుమోహన్ మాట్లాడుతూ,ప్రతీ ఒక్కరూ రసాయన ఎరువుల,పురుగు మందుల వాడకం క్రమంగా తగ్గించుకుంటూ పూర్తిగా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కోరారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా లాభాలు ఆర్జించ వచ్చని,దానికి నిబద్దత మరియు ప్రకృతి పట్ల విచక్షణ ఉండాలని అన్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల అంచనా ప్రకారం ఎల్ నినో ప్రభావం కారణం చేత ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యంగా కురుస్తాయి కావున ప్రతీ రైతూ ఈ సమయంలో వారి పొలాల్లో పీఎండి యస్ కిట్లు వేసుకుని సాగు చేయటం ద్వారా నేల సారవంతం అవుతుందని, తదుపరి వేసే ప్రధాన పంట సమయంలో ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గించ వచ్చునని సూచించారు.ప్రకృతి వ్యవసాయం చేస్తూ లాభాలని ఆర్జిస్తున్న రైతుల అనుభవాల్ని వివరించారు. తదుపరి మండల వ్యవసాయ అధికారి బ్రహ్మరెడ్డి మాట్లాడుతూ , రానున్న కాలంలో ప్రకృతి వ్యవసాయం ఎక్కువగా అవలంబిస్తారన్నారు. వినియోగ దారుల మార్కెట్ లో ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంటలకు బాగా డిమాండ్ ఉన్నదని,ఇటువంటి పద్దతుల్లో వ్యవసాయం చేసి ప్రతీ రైతూ లాభం పొందాలని సూచించారు.
పెదపులివర్రు లో..
పెదపులివర్రు గ్రామంలోని ఏటీఎం మోడల్ పొలాన్ని సందర్శించటం జరిగింది.ప్రకృతి వ్యవసాయం అవలంబించే రైతులు,ద్రవ జీవామృతం,బీజమృతం తయారీ పద్దతులను,పద్దతి ప్రదర్శన ద్వారా క్షేత్రంలోనే తయారు చేసి చూపించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఇఓ లు, విఎఎలు,ఏపీ సీ ఎయన్ ఎఫ్ మాస్టర్ ట్రైనర్,మండల కోఆర్డినేటర్,సిబ్బంది పాల్గొన్నారు.