PEN POWER
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 9:36 pm Posted By : M CHANTI BABU

స్థానిక ఎన్నికల్లోనూ 100శాతం స్ట్రైక్ రేట్ సాధించాలి:జనసేన నాయకులకు డాక్టర్ వంపూరు గంగులయ్య పిలుపు

స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్,మే 29: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ సాధించిన 100 శాతం స్ట్రైక్ రేట్‌ను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఆంధ్రప్రదేశ్ జానపద కళలు మరియు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య పేర్కొన్నారు. శుక్రవారం పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. అధిష్టానం నుంచి అందిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెలలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందువల్ల గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని అన్నారు. పార్టీ పోటీ చేసే ప్రతి స్థానంలో సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకు వెళ్లి శతశాతం విజయాలు సాధించే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.పార్టీ బలోపేతం, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజలతో మమేకం కావడం, బూత్ స్థాయి కమిటీలను చురుకుగా పనిచేయించడం వంటి అంశాలపై నాయకులకు పలు సూచనలు చేశారు. పార్టీ సిద్ధాంతాలు, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను గ్రామ గ్రామానికీ తీసుకెళ్లి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు సీదరి రామమూర్తి, అధికార ప్రతినిధి దివ్యలత, మండల అధ్యక్షుడు నందోలి మురళీ, మజ్జి సత్యనారాయణ, కుంచె దేవేంద్ర ప్రసాద్, వంపూరు సురేష్, మద్దెల నాగేశ్వరరావు, అప్పలరాజు, అయ్యప్ప, శ్రీను తదితరులు పాల్గొన్నారు.