సనపల ధనరాజు దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం
భక్తజన సందోహం మధ్య విగ్రహ ప్రతిష్ఠ..
భారీగా తరలివచ్చిన భక్తులకు మహా అన్నదానం
కాజులూరు, పెన్ పవర్, జూన్ 24: కాజులూరు మండల పరిధిలోని ఆర్యవటం గ్రామం బుధవారం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. గ్రామానికి చెందిన ప్రముఖ దాతలు సనపల ధనరాజు – ఇందిరా దంపతులు తమ తల్లిదండ్రులు స్వర్గీయ సనపల కన్నయ్య – అప్పయ్యమ్మ దంపతుల స్మారకార్థంగా నిర్మించిన శ్రీ సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామి నూతన ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.గ్రామ పెద్దల కథనం ప్రకారం బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతంలో శ్రీ సీతారాముల ఆలయం ఉండేదని, కాలక్రమేణా అది శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. ఆ పురాతన ఆలయ వైభవాన్ని పునరుద్ధరించాలనే సంకల్పంతో సనపల ధనరాజు దంపతులు ముందుకొచ్చి గ్రామ ప్రజలు, భక్తులు, స్థలదాతల సహకారంతో నూతన ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, చిక్కాల దొరబాబు, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, కాకరపల్లి విశ్వనాథం తదితర ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ హోమాలు నిర్వహించగా, మధ్యాహ్నం హనుమాన్ చాలీసా భజనలు ఆలయ ప్రాంగణాన్ని భక్తిరసమయంగా మార్చాయి.
భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామస్తులు, భక్తులు, సేవకులు కలిసి అన్నదాన సేవలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అలాగే ఆలయ నిర్మాణానికి కరప మండలం పెద్దాపురప్పాడు గ్రామానికి చెందిన కీర్తిశేషులు వెలగా రామన్న – నారాయణమ్మ దంపతులు స్థలదానం చేసిన విషయాన్ని నిర్వాహకులు కృతజ్ఞతతో స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త సనపల ధనరాజు మాట్లాడుతూ, “తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టేందుకు, గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు ఈ ఆలయ నిర్మాణం చేపట్టాం. భక్తులందరి సహకారంతో శ్రీరామాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం విజయవంతం కావడం ఆనందంగా ఉంది” అని తెలిపారు.
కార్యక్రమంలో తోట పృథ్వి, కోట తాత అబ్బాయి, గెల్లి సత్తిబాబు, కురుపూడి శంకర్రావు, అంగర కృష్ణ, శలపాక నీటి సంఘం అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త,తాడి రామారెడ్డి, కొల్లి హనుమంతు చౌదరి, జడ్పీటీసీ వనుం వెంకట సుబ్బారావు, చందాల ఆదినారాయణ, చందాల మల్లి బాబు,శలపాక మాధవరపు దొరబాబు, డేగల దొరబాబు,డీసీ లకాని కృష్ణచైతన్య, అంగర శ్రీను, బొడ్డు నాగమల్లి, కురుపూడి దొరబాబు, చుండ్రు రుద్రా చౌదరి, నక్కా శ్రీను, తోట కృష్ణ, వడ్డి శ్రీనివాసరావు, జక్కన రాజేష్, సనపల కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భక్తి, సేవ,దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన సనపల ధనరాజు – ఇందిరా దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఆర్యవటం గ్రామ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.