పెడన, పెన్ పవర్, జూన్ 13
బంటుమిల్లి మండలం డీసీ పరిధిలోని పంట కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయించి రైతుల ప్రశంసలు అందుకుంటున్నారు డీసీ చైర్మన్ బొర్రా కాశీ. రైతులకు సాగునీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరేలా కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. పంట కాలువల్లో పెరిగే గుర్రపు డెక్క, తూడు, నాచు మొక్కలను గుర్తించి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు.కాలువల్లో కలుపు మొక్కలు విస్తరించకుండా కలుపు మందును పిచికారీ చేయిస్తూ నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగిస్తున్నారు.కాలువల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సిబ్బందితో శుభ్రపరిచే పనులు చేపడుతున్నారు. దీంతో సాగునీరు సాఫీగా ప్రవహిస్తూ రైతులకు సమయానికి అందుతోంది. పంట కాలువలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యవసాయానికి ప్రయోజనం చేకూరుతుందనే లక్ష్యంతో బొర్రా కాశీ అహర్నిశలు కృషి చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు.డీసీ పరిధిలోని కాలువలు ప్రస్తుతం పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో ఇతర ప్రాంతాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయని రైతులు అభిప్రాయపడుతున్నారు.రైతుల సమస్యలను గుర్తించి వెంటనే స్పందిస్తూ సాగునీటి వ్యవస్థను మెరుగుపర్చడంలో విశేష కృషి చేస్తున్న డీసీ చైర్మన్ బొర్రా కాశీకి పలువురు రైతులు అభినందనలు తెలియజేస్తున్నారు. పంట కాలువలు అంటే ఇలాగే ఉండాలనే విధంగా నిర్వహణ చేపట్టడం అభినందనీయమని రైతులు కొనియాడుతున్నారు.