PEN POWER
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 6:37 am Posted By : Sathish Bede

మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

చింతూరు, పెన్ పవర్, జూన్ 13:

మహిళలపై జరుగుతున్న మోసాలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా నియమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ, ఎస్సై సంతోష్ కుమార్ సూచించారు. చింతూరు మండలంలోని చట్టి జంక్షన్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ హేమంత్ కుమార్ పర్యవేక్షణలో గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, యువత మొబైల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే నకిలీ కాల్స్‌ను నమ్మవద్దని సూచించారు. అలాంటి కాల్స్ వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహిళలు వేధింపులకు గురైతే వెంటనే 112కు కాల్ చేయాలని, విద్యార్థినులు శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అలాగే గంజాయి సేవించడం, అక్రమ రవాణా చేయడం, మాదక ద్రవ్యాల వ్యాపారానికి సహకరించడం నేరమని హెచ్చరించారు. గంజాయి వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై మాట్లాడుతూ, అతివేగంగా వాహనాలు నడపడం, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ద్విచక్ర వాహనాలపై ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణించడం చట్టవిరుద్ధమని తెలిపారు. మైనర్ బాలబాలికలకు వాహనాలు ఇవ్వవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం కూడా నేరమేనని, డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అపరిచితులు సంచరించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమం ముగింపులో యువత, గ్రామస్తులతో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు యువత పాల్గొన్నారు.