PEN POWER
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 1:04 pm Posted By : PEN POWER MEDIA

జగన్ చుట్టూ కొత్త కోర్ టీమ్..!

పాత కవచానికి గుడ్‌బై చెప్పనున్నారా?
నమ్మిన వారిపైనే నిరాశ..!
వైసీపీ భవిష్యత్ వ్యూహంపై జగన్ ఫోకస్
ఎన్నికల ఓటమి తర్వాత ఆత్మపరిశీలనలో జగన్
కోర్ టీమ్‌పై పెరిగిన ఆరోపణలు
దర్యాప్తు సంస్థల వెల్లడింపులతో షాక్
నమ్మిన వారిపైనే అనుమానాల మేఘాలు
పాదయాత్రకు ముందు పార్టీ పునర్వ్యవస్థీకరణ
కొత్త టీమ్‌లో ఎవరికీ అవకాశం?
జగన్ కొత్త టీమ్.. వైసీపీ పునర్నిర్మాణానికి శ్రీకారం?

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపు వద్ద నిలిచినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు అత్యంత నమ్మకస్తులుగా భావించిన కోర్ టీమ్ సభ్యులపై వస్తున్న ఆరోపణలు, విచారణల్లో బయటపడుతున్న అంశాలు ఆయనను కొత్త ఆలోచనల వైపు నడిపిస్తున్నాయని సమాచారం. 2024 ఎన్నికల పరాజయం తర్వాత పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన జగన్, భవిష్యత్ రాజకీయ పోరాటాలకు కొత్త బృందాన్ని సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే పాదయాత్రను దృష్టిలో పెట్టుకుని పార్టీ నిర్మాణంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పెన్ పవర్ ప్రత్యేక ప్రతినిధి నెల్లూరు, జూన్ 11:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయంగా కీలక నిర్ణయాల దశలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో తనకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన కోర్ టీమ్‌పై పెరుగుతున్న వివాదాలు, ఎన్నికల పరాజయం తర్వాత వెలుగులోకి వచ్చిన పరిణామాలు, దర్యాప్తు సంస్థల విచారణలు తదితర అంశాలు ఆయన ఆలోచనల్లో మార్పుకు కారణమయ్యాయని తెలుస్తోంది.

వైసీపీ ఆవిర్భావం నుంచి అధికారంలోకి వచ్చిన దశ వరకు జగన్ చుట్టూ ఒక ప్రత్యేక బృందం పనిచేసింది. పార్టీ, ప్రభుత్వం, రాజకీయ వ్యూహాలు, పరిపాలనా నిర్ణయాల్లో ఈ బృందం కీలక పాత్ర పోషించింది. వ్యక్తిగత సహాయకులు, సలహాదారులు, కీలక అధికారులు, అత్యంత సన్నిహిత రాజకీయ నేతలు ఈ కోర్ టీమ్‌లో భాగమయ్యారు.అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొన్న ఘోర పరాజయం తర్వాత పార్టీ అంతర్గత వ్యవహారాలపై విస్తృత చర్చ మొదలైంది. ముఖ్యంగా పార్టీ నాయకత్వానికి, క్షేత్రస్థాయి నేతలకు మధ్య దూరం పెరగడానికి కోర్ టీమ్ వ్యవహారశైలే కారణమని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో వచ్చిన ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోని జగన్, ఎన్నికల ఫలితాల అనంతరం వాటిపై మరింత లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో కొందరు మాజీ అధికారులు, సన్నిహితులపై అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు, ప్రత్యేక విచారణ బృందాలు బయటపెడుతున్న అంశాలు పార్టీ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతున్నాయి. తమకు అత్యంత విశ్వసనీయులుగా భావించిన వ్యక్తుల పేర్లు వివాదాల్లో వినిపించడంతో జగన్ అసంతృప్తికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది.ఇక భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై దృష్టి పెట్టిన జగన్, పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది చేపట్టనున్న పాదయాత్రను ప్రధాన రాజకీయ ఆయుధంగా భావిస్తున్న ఆయన, ఆ యాత్రకు ముందే పార్టీ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కోర్ టీమ్ స్థానంలో కొత్త బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువ నాయకులు, ప్రజల్లో చురుకుగా పనిచేసే నేతలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే కొత్త టీమ్‌లో ఎవరు ఉంటారు? పార్టీ భవిష్యత్ వ్యూహాన్ని ఎవరు నడిపిస్తారు? అనే అంశాలపై ఇంకా స్పష్టత లేదు. పార్టీ పునర్నిర్మాణం, నాయకత్వ శైలి మార్పు, ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం వంటి అంశాలపై జగన్ తీసుకునే నిర్ణయాలు రానున్న రోజుల్లో వైసీపీ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.