రంపచోడవరం, పెన్ పవర్, జూన్ 25: పోలవరం జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిజికల్ డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలోని 12 మండలాల్లో యువతకు క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, బంజరు, గ్రామకంఠం భూములను క్రీడా మైదానాల కోసం గుర్తిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 50 స్పోర్ట్స్ గ్రౌండ్లు గుర్తించినట్లు వెల్లడించారు. గ్రామాల్లో క్రీడా మైదానాలను అభివృద్ధి చేసి యువతకు క్రీడా సామగ్రి అందజేసి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు.
క్రీడలు యువతను చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉంచడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలకు కూడా దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా క్రీడా అధికారి సతీష్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.