గూడెం కొత్తవీధి,పెన్ పవర్ జులై20:అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు నదీ పరివాహక ప్రాంతంలో వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జలాశయా ల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. అన్ని జలాశయాలు జలకళతో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది జూన్ నెలాఖరుకు జలాశయాలన్నీ అడుగంటాయి.ఈ తరుణంలో అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో జలాశయాల నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి.సీలేరు కాంప్లెక్సు పరిధిలో జోలాపుట్ జలాశయం నీటితో మాండ్ విద్యుత్ కేంద్రంలో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ జలాశయం గరిష్ట నీటి మట్టం 2,750 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 2708.50 అడుగులకు చేరింది.ఇది ఆంధ్రా,ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టు. ఇక్కడ విద్యుదుత్పత్తి అనంతరం విడుదలైన నీరు బలిమెల జలాశయంలో వచ్చి చేరుతుంది. బలిమెల జలాశయం గరిష్ట నీటి మట్టం 1,516 అడుగులు కాగా ప్రస్తుతం 1,452,70 అడుగులకు పెరిగింది. గుంట వాడ జలాశయం గరిష్ట నీటి మట్టం 1360 అడుగులు కాగా ప్రస్తుతం 1,345 అడుగులకు చేరింది. డొంకరాయి జలాశయం గరిష్ట నీటి మట్టం 1037 అడుగులు కాగా, ప్రస్తుతానికి 1006.90 అడుగులకు పెరిగింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సీలేరు కాంప్లెక్సులో 3 టీఎంసీల నీటి నిల్వలు పెరిగాయని సీలేరు ఏపీ జెన్కో ఈఈ ప్రభాకరరావు తెలిపారు. రానున్న ఆగస్టు, సెప్టెంబర్లో సీలేరు నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తేనే బలిమెల జలాశయంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు చేరుతాయని జెన్కో ఈఈ ప్రభాకరరావు తెలిపారు.