"జాజుల బంధ" గిరిజనుల ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
కొయ్యూరు, పెన్ పవర్, జూలై 16:
"సరైన రోడ్డు లేదు. గ్రామంలో నెలలు తరబడి పాఠశాల తెరుచుకోలేదు, గర్భిణీలకు బాలింతలకు అంగనవాడి ద్వారా అందాల్సిన పౌష్టికాహారం కాన రాలేదు"అంటూ మండలంలోని మూలపేట పంచాయితీ మారుమూల జాజుల బంధ గిరిజనులంతా జిల్లా కలెక్టర్కు వాట్సాప్ ద్వారా చేసిన ఫిర్యాదుతో అధికార యంత్రాంగం లో కదలిక వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఈఓ లు రాంబాబు బోడం నాయుడు తదితరులు మంగళవారం జాజుల బంధ గ్రామానికి వెళ్లి విచారణ నిర్వహించారు. ఈ విచారణలో రీఓపెనింగ్ నుండి పాఠశాల తెరుచుకోలేదని,మిడ్ డే మీల్స్ అందించలేదని నిర్ధారణ అయింది.నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) ఆదేశాల మేరకు గ్రామాన్ని సందర్శించిన అప్పటి జిల్లా కలెక్టర్ పాఠశాలను మంజూరు చేశారు. కాగా ఈ పాఠశాల రీఓపెనింగ్ అనంతరం తెరుచు కోకపోవడంపై గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక అందించుచున్నట్టు విచారణ అధికారులు తెలిపారు.ఇలా ఉండగా గ్రామంలో సుమారు 20 మంది వరకు గర్భిణీలు బాలింతలు, ఉన్నప్పటికీ అంగన్వాడి కేంద్రం లేక సుదూరంలో ఉన్న కొండసంత గ్రామం వెళ్లి తీసుకోవలసిన పరిస్థితి ఉందని, దీనితో పోష్టికాహారం అందని ద్రాక్షలా మారిందని గ్రామానికి చెందిన వెంకటరావు, మర్రి కామేష్ తదితరులు ఆరోపించారు. ఇక తమ గ్రామ రోడ్డు నిర్మాణానికి రూ. 73 లక్షలు నిధులు మంజూరు అవ్వగా ప్రోక్లైయిన్ తో అరకొరగా చేసి, రూ 29.9 లక్షలునిధులు డ్రా చేసుకున్నారని, గతంలో బైకులు నడిచే రోడ్డు, ఇప్పుడు నడవడానికి కూడా వీలు లేకుండా తయారైందన్నారు. గతంలో జాజుల బంధ, నీళ్ల బంధ, పిత్రి గడ్డ, పెద్ద గరువు గ్రామాలకు చెందిన గిరిజనులు అంతా చందాలు వేసుకుని రోడ్డును నిర్మించుకునే ప్రయత్నం చేసామన్నారు.