ePaper
Saturday, March 21, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడకోనసీమ కొబ్బరి రైతులకు గడ్డుకాలం

కోనసీమ కొబ్బరి రైతులకు గడ్డుకాలం

📰 Generate e-Paper Clip

  • మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది

  • ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు పతనం

  • చెన్నై పోర్టుల్లో నిలిచిపోయిన కంటెయినర్లు

  • రంజాన్ డిమాండ్ ఆశలు నీరుగార్చిన యుద్ధం

  • గతంతో పోలిస్తే భారీగా తగ్గిన ధరలు

  • ఉత్పత్తి పెరగడంతో మార్కెట్ ఒత్తిడి

  • గల్ఫ్ దేశాలపై ఆధారపడిన కొబ్బరి వ్యాపారం

  • శ్రీరామనవమి డిమాండ్ కూడా నిరాశపరిచింది

  • తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన దుస్థితి

  • వెయ్యికాయ‌ల‌కు రూ. 13వేలు నుంచి రూ.14 వేలే

కాకినాడ, పెన్ పవర్ మార్చి 20

 

కేర‌ళ‌ను త‌ల‌పించే కొబ్బ‌రి అందాలు కోన‌సీమకు సొంతం.. ఉద్యాన పంట‌ల్లో రైతుల‌కు కొబ్బ‌రి ఆదాయ‌మే అధికం.. అయితే ఇప్ప‌డు మిడిల్ ఈస్ట్‌లో జ‌రుగుతోన్న యుద్ధం కోన‌సీమ కొబ్బ‌రికి కాస్త గ‌డ్డుకాలంగా మారింది.. ప్ర‌తీ రోజూ ట‌న్నుల కొద్దీ కొబ్బ‌రి స్వ‌దేశీ మార్కెట్ కే కాక‌ ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి అయ్యే కోన‌సీమ కొబ్బ‌రి అమాంతంగా నిలిచిపోయాయి.. యుద్థం ప్ర‌భావంతో చెన్నై పోర్టుల్లో కొబ్బ‌రి కంటైనర్లు ఎక్క‌డిక్క‌డే నిలిచిపోవ‌డంతో ఉత్ప‌త్తి పెరిగి ఎగుమ‌తులు లేక ధ‌ర‌లు ప‌త‌న‌ం అయ్యాయం టున్నారు కొబ్బ‌రి రైతులు.. రంజాన్ తో గ‌ల్ఫ్ దేశాల‌కు ఎగుమ‌తులు చేసి లాభాలు సంపాదిద్దామ‌నుకున్న త‌రుణంలో యుద్ధ‌మేఘాలు కొబ్బ‌రి రైతుల‌పై నీళ్లు చ‌ల్లాయంటున్నారు.గ‌తంతో పోలిస్తే గ‌ల్ఫ్ దేశాల‌కు ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి కొబ్బ‌రి ఎగుమ‌తులు గ‌ణ‌నీయంగా పెరిగాయ‌ని కొబ్బ‌రి వ్యాపారులు చెబుతున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొబ్బ‌రి ఎగుమ‌తులు పెద్ద ఎత్తున జ‌రుగుతోండ‌గా కోన‌సీమ ప్రాంతం నుంచి కూడా త‌గ్గ‌ట్టుగానే ఎగుమ‌తులుంటున్నాయంటున్నారు.. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో గ‌ల్ఫ్ దేశాల్లో కొబ్బ‌రికి బాగా డిమాండ్ ఏర్పడింది. గ‌ల్ఫ్ దేశాల్లో రంజాన్ సంద‌ర్భంగా సాంప్ర‌దాయ వంట‌కాల్లో కొబ్బ‌రిని ఎక్క‌వుగా వాడుతుంటార‌ని, దీంతోపాటు ఆదేశ సౌంద‌ర్య‌, ఇత‌రాత్ర త‌యారీ సామాగ్రిలో కొబ్బ‌రి వినియోగం బాగా పెరిగిందంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, దుబాయ్, ఇరాన్, ఖ‌తార్ దేశాలకు కొబ్బ‌రి ఎగుమతులు జ‌రుగుతుండ‌గా రంజాన్ నేప‌థ్యంలోనే ఆ దేశాల‌కు కొబ్బ‌రి ఎగుమ‌తులు చేసేందుకు అంతా సిద్ధం చేశారు. అయితే ఎగుమ‌తి అయిన స‌రుకు పోర్టుల్లోని కంటెయినర్ల‌లోనే చిక్కుకుపోయిన ప‌రిస్థితి ఏర్ప‌డిందంటున్నారు..ప్ర‌స్తుతం వెయ్యికాయ‌ల‌కు రూ. 13వేలు నుంచి రూ.14 వేలు ఉంది.. గ‌తేడాది సెప్టెంబ‌ర్ నుంచి న‌వంబ‌ర్, డిసెంబ‌ర్ నెల‌ల్లో రికార్డు స్థాయిలో రైతులు లాభాలు పొందారు.. వెయ్యికాయ‌కు రూ. 27 వేలు వ‌ర‌కు ధ‌ర‌ ప‌లికింది.. కురిడీ కాయ గ‌తంలో రూ. 30 వేలు నుంచి రూ. 35 వేలు వ‌ర‌కు వెళ్లింది..కానీ ఇప్పుడు రూ. 26 వేలు నుంచి రూ. 29 వేలు వ‌ర‌కు న‌డుస్తోంది.. రంజాన్ మాసంలో విదేశాల‌కు ఎగుమ‌తుల‌య్యే స‌రుకుకు ఆశాజ‌న‌కంగా లాభాలు ఆర్జించ‌వ‌చ్చ‌ని చూసిన రైతుల‌కు, వ్యాపారుల‌కు ఇరాన్ ఇజ్రాయేల్‌, అమె రికా యుద్ధం బాగా దెబ్బ‌కొంటిందంటున్నారు. ఇక శ్రీ‌రామ‌న‌వ‌మికి దేశవ్యాప్తంగా కొబ్బ‌రికి డిమాండ్ ఉంటుందనుకున్న రైతులకు ఇది కూడా ఊర‌ట‌ నివ్వ‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంది.. న‌వ‌మి తొమ్మిది రోజుల పాటు కొబ్బ‌రికి డిమాండ్ ఉండ‌గా అయితే ఉత్ప‌త్తి బాగా పెరిగిపోవ‌డంతో డిమాండ్ త‌గ్గింది..ప్ర‌స్తుతం మిడిల్ ఈస్ట్ దేశాలైన గ‌ల్ఫ్ ఏడు దేశాల్లో యుద్ధ వాతావ‌ర‌ణంతో నిండిపోయింది.. ఇరాన్‌పై ఇజ్రాయేల్‌, అమెరికా సేన‌లు విరుచ‌కుప‌డుతున్నాయి.. మ‌రో పక్క దుబాయ్‌, కువైట్‌, సౌదీ అరేబియా, ఒమాన్‌, బెహ్ర‌యిన్ దేశాల‌పై ఇరాన్ డ్రోన్ల‌తో దాడులు చేస్తుంది.. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ముంబయి, చెన్నై, తూత్తుకూడి పోర్టుల్లోనే కొబ్బ‌రి కాయలతో కంటెయినర్లు నిలిచిపోయాయని అంబాజీపేట కొబ్బ‌రి మార్కెట్‌కు సంబందించిన కొబ్బ‌రి రైతులు చెబుతున్నారు. యుద్ధం ఎప్పుడు ముగు స్తుందో.. ఆయా దేశాలకు ఎగుమతులు ఎప్పుడు ప్రారంభమవు తాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందంటున్నారు. ఈ నేప థ్యంలో ఆయా ఓడరేవుల్లో ఉన్న సరకును స్థానికంగా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ధరల పతనంతో తీవ్రంగా న‌ష్ట‌పోతున్నామంటున్నారు.. ఇదిలా ఉంటే యుద్ధ ప్ర‌భావాన్ని చూపుతున్న వ్యాపారులు మ‌రింత త‌క్కువ ధ‌ర‌ల‌కే కొనుగోలు చేస్తున్నార‌ని రైతులు వాపోతున్నారు..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular