గిరిజన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల పెంపు కోరుతూ విజ్ఞప్త
ఆర్టీసీ నూతన ఎండిని కోరిన విజయనగరం జోన్ ఆర్టీసీ చైర్మన్ డాక్టర్ సియ్యారి దొన్ను దొర
స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్, మార్చి 24:గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరచేందుకు ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని విజయనగరం జోన్ చైర్మన్ డాక్టర్ సియ్యారి దొన్ను దొర విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) నూతన మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ ఎన్. బాలసుబ్రమణ్యంను మంగళవారం విజయవాడలోని కేంద్ర కార్యాలయంలో కలిసి ఈ మేరకు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో రహదారి సదుపాయాలు మెరుగుపడినప్పటికీ, తగినంత బస్సు సర్వీసులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా బస్ సర్వీస్ లేని గ్రామాలకు తక్షణమే బస్సులు మంజూరు చేయాలని కోరారు.విజయనగరం జోన్ పరిధిలో ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి అంశాలపై ఎండీతో చర్చించిన ఆయన, ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన అరకు నియోజకవర్గంలోని బస్ స్టేషన్ ఆధునికీకరణకు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.మహిళల కోసం అమలు చేస్తున్న ‘శ్రీ శక్తి’ ఉచిత బస్సు పథకం గిరిజన ప్రాంతాల్లో సక్రమంగా అందుబాటులోకి రావాలంటే బస్సుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. వివిధ మండలాలకు అవసరమైన బస్సుల వివరాలతో కూడిన నివేదికను ఎండీకి సమర్పించారు.దీనిపై ఎన్. బాలసుబ్రమణ్యం సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.



