బాలయేసు పుణ్యక్షేత్రానికి కదిలిన వేలాదిమంది భక్తులు
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 :
చిలకలూరిపేట: ప్రస్తుతం క్రైస్తవ లోకం అనుసరిస్తున్న 40 రోజుల లెన్త్ శ్రమలదినాలను పురస్కరించుకొని, పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తమ పాప పరిహారార్థం పుణ్యక్షేత్రాలను సందర్శించడం రోమన్ క్యాథలిక్ క్రైస్తవుల ఆచారం కావడంతో, గురువారం పట్టణంలోని చార్లెస్ కాన్వెంట్ వద్ద ఉన్న ఆర్సీయం చర్చి నుండి భారీ పాదయాత్ర నిర్వహించారు.
నాదెండ్ల మండలం కనపర్రులోని బాలయేసు పుణ్యక్షేత్రం లక్ష్యంగా సాగిన ఈ పాదయాత్రలో సుమారు రెండు వేలమంది భక్తులు పాల్గొన్నట్లు చర్చి ఫాదర్ పి. థామస్ వెల్లడించారు. భక్తిగీతాలు ఆలపిస్తూ, ప్రార్థనలు చేస్తూ భక్తులు ఈ పాదయాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు చుక్క విన్సెంట్ పాల్తో పాటు పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.


