నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి మరో 8 కోట్లు
– రెండేళ్లలో రూ.24 కోట్లు మంజూరు
-నాణ్యతలో రాజీ పడొద్దు, పనులను ప్రజలే పర్యవేక్షించాలి
-స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, నర్సీపట్నం మున్సిపాలిటీ మరో 8కోట్లు మంజూరయ్యాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. గత రెండేళ్లలో ఏకంగా 24 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆదివారం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రెండేళ్ల కాలంలో మున్సిపాలిటీకి 24 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని, ఈ నిధులతో 341 పనులు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను విజయవంతంగా పూర్తి చేశామని వివరించారు. తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) ద్వారా నర్సీపట్నం మున్సిపాలిటీకి మూడో విడత కింద మరో 8 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఆదివారం ఉదయం తమకు అందాయని ఆయన స్పష్టం చేశారు. ఈ 8 కోట్ల రూపాయల నిధులతో నర్సీపట్నంలోని 28 వార్డుల్లో మొత్తం 81 పనులకు రూపకల్పన చేశామన్నారు. ఒకే మున్సిపాలిటీకి రెండేళ్లలో 32 కోట్ల రూపాయలు కేటాయించడం సాధారణ విషయం కాదని, కాబట్టి ఈ పనులన్నీ నాణ్యతతో జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వార్డుల్లో జరిగే ఈ అభివృద్ధి పనులను స్థానిక నాయకులు, పెద్దలు దగ్గరుండి పర్యవేక్షించాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. అలాగే ప్రజలు కూడా తమ వీధుల్లో వేస్తున్న రోడ్లు సక్రమంగా ఉన్నాయో లేదో గమనించాలని, ఎక్కడైనా పనుల్లో తేడాలు ఉన్నా, నాణ్యతా లోపాలు కనిపించినా నేరుగా తనకు మెసేజ్ ద్వారా లేదా ఇతర మార్గాల్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అలా వచ్చిన ఫిర్యాదులపై తాను బాధ్యత వహించి వెంటనే ఆ పనులను సరిచేయిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.



