
ప్రగతినగర్లో ఫర్నిచర్ షాపులు దగ్ధం.. ఎగిసి పడుతున్న మంటలు..
బాచుపల్లి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాల సమీపంలో ఘటన..
దుండిగల్, పెన్ పవర్, మార్చి 3:
సైబరాబాద్ పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ కమాన్ సమీపంలో ఉన్న కె.జి.ఆర్ కన్వెన్షన్ పక్కన నిర్మించిన ఫర్నిచర్ షాపుల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో, మియాపూర్ వెళ్ళే రహదారి పక్కనే కావడం ఈ అగ్నిప్రమాద ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది.. స్థానికుల కథనం ప్రకారం, ఎమ్మెల్సీ నవీన్ రావు మామ దామోదర్ రావుకు చెందిన స్థలంలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే షాపులు నిర్మించి, ఫర్నిచర్ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.. అగ్నిప్రమాదంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్షణాల్లో మంటలు వ్యాపించి షాపుల్లో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా కాలిపోతుండటాన్ని స్థానికులు ఆ దృశ్యాలు చిత్రీకరించారు.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.. అప్పటికే ఫర్నీచర్ అగ్నికి ఆహుతి అయింది.. అర్ధరాత్రి అయినందున ఆ ప్రాంతం అంతా పొగతో కమ్ముకుపోయింది.. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణమా..? లేక మరేదైనా కారణమా..? పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. అనుమతుల్లేకుండా నిర్మాణాలు, భద్రతా ప్రమాణాల లోపం ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు ఆరోపిస్తున్నారు..



