చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 24:
చిలకలూరిపేట: ప్రభుత్వాల నుంచి లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ వైద్యులు, నిబంధనలకు విరుద్ధంగా సొంతంగా ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించడం ఏమిటని పల్నాడు జిల్లా భారతీయ యువ మోర్చా అధ్యక్షులు పులిగుజ్జు మహేష్ ప్రశ్నించారు. మంగళవారం చిలకలూరిపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రోగుల సౌకర్యార్థం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు 30 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారని ఆయన గుర్తు చేశారు. అయితే, ఇంతటి వసతులు ఉన్నప్పటికీ, విధుల్లో ఉండాల్సిన వైద్యులు రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి వచ్చే రోగులు ఓపీ సేవల కోసం గంటల తరబడి వేచి చూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వైద్యుల అశ్రద్ధ వల్ల నిరుపేద రోగులకు అన్యాయం జరుగుతోందని, ఈ విషయంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిబంధనలు అతిక్రమించి ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న సంబంధిత ప్రభుత్వ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పులిగుజ్జు మహేష్ కోరారు.
రిపోర్టర్ వివరాలు
పేరు: SRIKANTH NARASIMHALAహోదా: STAFF REPORTER
ప్రాంతం: CHILAKALURI PETA, PALNADU DIST



