గ్రామాల్లో అటవీశాఖ సిబ్బంది అవగాహన సదస్సులు
అప్రమత్తం అవుతున్న గిరిజనులు
గంగవరం, పెన్ పవర్, మార్చి 2:
పోలవరం జిల్లాలో పులి సంచారం ప్రజలను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తుంది. ఇటీవల మైదాన ప్రాంతాల్లో హల్ చల్ చేసిన పెద్దపులిని అటవీ శాఖ అధికారులు బంధించి విశాఖ జూ కు తరలించారు. ఆరోగ్య పరీక్షల అనంతరం ఆ పెద్దపులిని పోలవరం ప్రాజెక్టు పరిసరాలలోని పాపికొండలు రిజర్వ్ ఫారెస్ట్ లో వదిలిపెట్టారు. కానీ పెద్దపులి రిజర్వ్ ఫారెస్ట్ ను వదిలి జన సంచార ప్రదేశాలకు తరలి వస్తుంది. ఇటీవల రంపచోడవరం మండలంలో పశువుల పై దాడి చేసిన ఘటనలు వెలుగులోకి రావడంతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. తొలిత గ్రామాల సమీపంలోకి పెద్దపులి సంచారం లేదని అటవీశాఖ అధికారులు మభ్య పెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని పెద్దపులి సంచారాన్ని పరిశీలిస్తున్నామని ప్రస్తుతం గ్రామాల్లోని ప్రజలపై దాడులు చేయడం లేదంటూ వెనకేసుకు వచ్చారు. కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో అటవీ శాఖ సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ పులి సంచారం పై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజల భయపడవలసిన పనిలేదని అటవీ శాఖ సిబ్బంది పులి సంచారం పై ఏర్పాటు చేసిన జియో టాకింగ్ ద్వారా పరిశీలిస్తున్నారని పులి సంచారం ఉన్న ప్రదేశాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. అవసరమైతే తక్షణ చర్యల నిమిత్తం నాగార్జునసాగర్ నుండి వచ్చిన ప్రత్యేక బృందం గ్రామాల్లో పర్యటిస్తుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు .పాపికొండలు ఏరియా నుండి రంపచోడవరం మండలంలోని తాళ్లపాలెం గ్రామాలు వద్ద పశువుల పై దాడి చేసి గంగవరం మండలం వైపు పయనం కట్టింది. ఆదివారం రాత్రి నుండి గంగవరం రంపచోడవరం సరిహద్దు ప్రాంతాల్లో నీటి వసతి గల ప్రదేశాల్లో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. అడ్డతీగల సబ్ డి ఎఫ్ ఓ సుబ్బారెడ్డి ఫోక్స్ పేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది సోమవారం నల్గొండ వెలమలకోట కొమరవరం కుసుమరాయి తదితర గ్రామాల్లో పర్యటించి పులి కదలికల పాదముద్రల సేకరణ చేపట్టి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికైనా అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించి తిరిగి పెద్దపులిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని ప్రజలు కోరుచున్నారు.



