సీతానగరం పెన్ పవర్
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న భార్య లతతో పాటు అత్త లక్ష్మీపై భర్త సోడదాసి పండు (అలియాస్ సీతారామరాజు) కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు కొంతకాలంగా విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. లత కొన్నాళ్లు కోటి కేశవరం గ్రామంలో తన చెల్లెలి ఇంటి వద్ద నివసించి, ఇటీవల తిరిగి తన తల్లి లక్ష్మీ వద్దకు వచ్చి ఉంటోంది. ఈ నేపథ్యంలో గత రాత్రి పండు అక్కడికి వెళ్లి భార్య లత, అత్త లక్ష్మీపై దాడికి దిగినట్లు సమాచారం.
దాడిలో తీవ్రంగా గాయపడిన
తల్లి, కూతురు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న సీతానగరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ వి వి ఎస్ మూర్తి,ఎస్సై డి. రామ్ కూమార్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
నిందితుడికి గతంలోనూ నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.


