రామచంద్రపురం, పెన్ పవర్ ఏప్రిల్10:
పేద ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్ఈసీసీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఎగ్ కార్ట్ పథకం ద్వారా లబ్ధిదారులు స్వయం ఉపాధి పొందవచ్చని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం తెలిపారు.
రామచంద్రపురం నియోజకవర్గంలోని తోటపేటలో లబ్ధిదారు దవులూరి సత్య మాధవి ఏర్పాటు చేసిన ఎగ్ కార్ట్ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ పథకం ద్వారా తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆదాయం పొందవచ్చని, ముఖ్యంగా సెర్ప్ మహిళా సంఘాల సభ్యులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. ప్రారంభ దశలో సుమారు రూ.50,000 పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చని, గుడ్లకు రోజువారీగా మంచి డిమాండ్ ఉండటంతో లాభదాయకంగా మారే అవకాశముందని వివరించారు.గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచేందుకు కూటమి పార్టీ కృషి చేస్తుందని, యువతను ప్రోత్సహించే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజలు ముందుకు వచ్చి ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం శిరంగి శ్రీధర్, సీసీ దుర్గ, వీఏఓలు దుర్గ, సత్య, సౌందర్య, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ నాయకులు పెంకే సాంబశివరావు, కూటమి పార్టీ నాయకులు చిల్లి నాగేశ్వరావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

