గంగవరం మండలంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ
గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 10: చిన్నారుల జీవితంలో తొలి మూడు సంవత్సరాలు మెదడు అభివృద్ధికి అత్యంత కీలకమని, ఈ దశలో తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపడం ద్వారా వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి వి. సుచరిత ఆదిలక్ష్మి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని చిన్నగార్లపాడు, పెదగార్లపాడు అంగన్వాడి కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఆమె సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జననం నుంచి రెండు సంవత్సరాల లోపు పిల్లల్లో మెదడు అభివృద్ధి సుమారు 80 శాతం జరుగుతుందని, ముఖ్యంగా 0 నుంచి 3 సంవత్సరాల మధ్య పిల్లల పెరుగుదల అత్యంత ప్రాధాన్యత కలిగిన దశ అని వివరించారు.అలాగే టీవీ, సెల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్ వంటి స్క్రీన్ పరికరాలు చిన్నారుల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, వీటి వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ప్యాక్ చేసిన జంక్ ఫుడ్ వల్ల రక్తపోటు, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించి, వాటి బదులుగా స్థానిక సాంప్రదాయ ఆహారాన్ని అలవాటు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పి. సీత, మహిళా కార్యదర్శి పాపాయమ్మ,
గర్భిణీలు, బాలింతలు, ఆశా వర్కర్లు, వార్డ్ సభ్యురాలు మడకం వెంకటలక్ష్మి, అంగన్వాడి టీచర్లు కే. సోమలమ్మ, ఎం. రాజలక్ష్మి, పి. చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు.

