రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి
గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 1:
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తూ, లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తున్నట్లు రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి తెలిపారు.బుధవారం గంగవరం మండలం జడేరు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న పేదలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెద్ద అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పింఛన్లు సకాలంలో, పారదర్శకంగా అందిస్తున్నది కూటమి ప్రభుత్వమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గత 22 నెలల్లో రూ.60,437 కోట్ల పింఛన్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమం సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు స్పందించకపోతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామస్థాయిలో సమస్యలను ముందుగా స్థానిక నాయకత్వం ద్వారా పరిష్కరించుకోవాలని, అవసరమైతే తాను అందుబాటులో ఉంటానని తెలిపారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి అధికారులు
ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే శిరీషాదేవి ఆదేశించారు. కార్యాలయాలకు వచ్చే ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించి, వారి సమస్యలను సమగ్రంగా వివరించి పరిష్కారం చూపాలని సూచించారు. సమస్య పరిష్కారానికి సమయం పట్టినా కారణాలను స్పష్టంగా తెలియజేయాలని, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిరగనివ్వకూడదని హెచ్చరించారు. మండల స్థాయిలోనే పరిష్కరించగల పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లాల వెంకటరెడ్డి, పిఎసిఎస్ అధ్యక్షుడు పాము అర్జున్, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ టిడిపి నాయకులు కనిగిరి రాంబాబు, కోసు ముసలయ్య, గండేపల్లి శ్రీను, ఎలుబండి బుల్లమ్మ, మడకం వెంకటరమణ, పల్లాల వీరభద్రారెడ్డి, మద్దీటి వెంకటరెడ్డి, కనిగిరి సుభాష్, మడకం సత్యవతి, కారం సత్యనారాయణ, కోసు మధు, మధు వీటి శివరామ భూపతిదేవ్, నర్సి సూరమ్మ, గడుతూరి నాగేశ్వరరావు, యాట్ల రమేష్, సారపు సత్యవేణి, పామర్తి వీరబాబు, కోసు బుల్లియమ్మ, సారపు నారాయణరావు, జనసేన అధ్యక్షుడు కుంజం సిద్దు, బిజెపి అధ్యక్షురాలు పుట్టపల్లి నీలాలమ్మ, కుంజం వెంకటేశ్వర్లు, తహసీల్దార్ చిన్నం శ్రీనివాసరావు, ఎంపీడీవో వై.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

