కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డా. వర్ణాలి దేఖ
గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 10: గిరిజన ప్రాంతాలలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా కేంద్ర ప్రభుత్వం వందన్ వికాస కేంద్రాలను ఏర్పాటు చేసిందని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డా. వర్ణాలి దేఖ తెలిపారు.శుక్రవారం రంపచోడవరం మండలం పందిరి మామిడి సెంటర్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో వందన్ వికాస కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసిన జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్ను ఆమె, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న వీవీకేలు, క్లస్టర్లు, మహిళా సంఘాల సంఖ్య, మహిళల పని గంటలు, ఉపాధి అవకాశాలు, నెలవారీ ఆదాయం, జీడిపప్పు ప్రాసెసింగ్ సామర్థ్యం, కొనుగోలు మరియు ఉత్పత్తి వివరాలు, మార్కెటింగ్ విధానంపై డైరెక్టర్ సమగ్రంగా ఆరా తీశారు. ఒక్కో మహిళ ఎంత మేర ఆదాయం పొందుతున్నది, జీడిపప్పు ధరలు, లాభాలపై కూడా వివరాలు సేకరించారు.గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం అడవి ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆమె పేర్కొన్నారు. గిరిజనుల భూములపై యాజమాన్య హక్కులు, జీవనోపాధి అవకాశాలు బలోపేతం చేయడమే ముఖ్య లక్ష్యమని అన్నారు.తరువాత ప్రాజెక్ట్ అధికారుల చాంబర్లో జాయింట్ కలెక్టర్తో కలిసి కేంద్ర పథకాల అమలు విధానంపై సమీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. అంబేద్కర్, ఏపీఓ జనరల్ డీఎన్వీ రమణ, రబ్బర్ బోర్డు డెవలప్మెంట్ అధికారి సుశాంత్ కుమార్ నాయక్, డీఆర్డీఏ డిపిఎం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

