మచిలీపట్నంలో అక్రమ నిర్మాణం కూల్చివేత ఘటన రాజకీయంగా కొత్త మలుపు తీసుకుంది.మాజీ మంత్రిపేర్ని వెంకట్రామయ్య (నాని)పై పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపుల ఆరోపణలతో కేసు నమోదైంది.పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు చిలకలపూడి పీఎస్లో కేసు నమోదు చేశారు.అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలు కూడా కేసులో చేరాయి. ఈ పరిణామం కృష్ణా జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
- అక్రమ నిర్మాణం కూల్చివేతతో మచిలీపట్నంలో టెన్షన్
- పోలీసులపై వ్యాఖ్యలతో పేర్ని నానిపై కేసు
- చిలకలపూడి పీఎస్లో అధికారిక నమోదు
- అధికారుల విధులకు ఆటంకం ఆరోపణ
- కృష్ణా జిల్లా రాజకీయాల్లో కొత్త హీట్
మచిలీపట్నం | పెన్ పవర్ | ఏప్రిల్ 3:
మచిలీపట్నంలో అక్రమ నిర్మాణం కూల్చివేత ఘటన నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై పోలీసులు కేసు నమోదు చేశారు. చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అధికారులను బెదిరించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.గురువారం మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఒక ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని అక్కడికి చేరుకుని అధికారుల చర్యలను తీవ్రంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిలకలపూడి సీఐ పరమేశ్వరరావు సహా అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై పోలీసు అధికారుల సంఘం ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పరిణామం మచిలీపట్నం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.

