ఏపీ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు రూ.1301 కోట్లు నేరుగా విడుదల చేసింది.గత 22 నెలల్లో మొత్తం కేంద్ర సహాయం రూ.2809 కోట్లకు చేరడం విశేషం.పునరావాసం, భూసేకరణతో పాటు నిర్మాణ పనులకు ఈ నిధులు కీలకం కానున్నాయి.పోలవరం పూర్తి లక్ష్యానికి ఇది మరో కీలక ముందడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.
- పోలవరానికి కేంద్రం నుంచి రూ.1301 కోట్ల భారీ ఊరట
- 22 నెలల్లో మొత్తం సహాయం రూ.2809 కోట్లు
- పనులు, పునరావాసానికి నిధుల వినియోగం
- సింగిల్ నోడల్ అకౌంట్కు చివరి విడత విడుదల
- 2027 లక్ష్యంతో శరవేగంగా పనులు
ఏలూరు | పెన్ పవర్ | ఏప్రిల్ 2:
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మరో శుభవార్త అందించింది. రాష్ట్ర జీవనాడిగా భావిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు రూ.1301 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు నేరుగా ప్రాజెక్టు ఖాతాలో జమ కానున్నాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. దీంతో గత 22 నెలల్లో కేంద్రం నుంచి పోలవరానికి అందిన మొత్తం సహాయం రూ.2809 కోట్లకు చేరింది. ఇప్పటికే గత విడతలో రూ.1508 కోట్లు విడుదల కాగా, తాజా నిధులతో నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. డయాఫ్రాగం వాల్ పునర్నిర్మాణం, ప్రధాన నిర్మాణ పనులతో పాటు పునరావాసం, భూసేకరణకు కూడా ఈ నిధులు కీలకంగా మారనున్నాయి.కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నిధుల అవసరాన్ని వివరించినట్లు తెలుస్తోంది. దానికి స్పందించిన కేంద్రం వెంటనే నిధులు విడుదల చేయడం ప్రాజెక్టుపై ఉన్న ప్రాధాన్యాన్ని సూచిస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సీఎం చంద్రబాబు కూడా పనుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, 2027 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తున్నారు.

