పశ్చిమాసియా యుద్ధం భారత్ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నట్టు మాజీ CEA Arvind Subramanian హెచ్చరించారు.చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా అంతరాయంతో GDP వృద్ధి 1 శాతం కంటే ఎక్కువ తగ్గే ప్రమాదం ఉందన్నారు.అదే సమయంలో ద్రవ్యోల్బణం 1 నుంచి 1.5 శాతం వరకు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.ప్రభుత్వ సబ్సిడీలు దీర్ఘకాలంలో కొనసాగవని, చివరికి ధరల భారం సామాన్యుడిపై పడుతుందని స్పష్టం చేశారు.ఈ సంక్షోభం భవిష్యత్ ఇంధన వ్యూహంపై భారత్కు గుణపాఠమవుతుందని అభిప్రాయపడ్డారు.
యుద్ధ ప్రభావంతో GDPపై భారీ ఒత్తిడి
చమురు-గ్యాస్ సరఫరా అంతరాయం హెచ్చరిక
ద్రవ్యోల్బణం 1.5% వరకు పెరిగే అవకాశం
సబ్సిడీలకు పరిమితి, భారం ప్రజలపై
పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి పెట్టాలన్న సూచన
న్యూస్ డెస్క్ | పెన్ పవర్ | ఏప్రిల్ 03:
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం భారత్ ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన మందగమన ముప్పులోకి నెడుతున్నట్టు మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు Arvind Subramanian హెచ్చరించారు. చమురు, సహజ వాయువు, ఎరువుల సరఫరా గొలుసు దెబ్బతినడంతో భారత్ వంటి దిగుమతులపై అధికంగా ఆధారపడే దేశాలకు “స్టాగ్ఫ్లేషన్ షాక్” తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఆయన అంచనా ప్రకారం, ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే దేశ GDP వృద్ధి 1 శాతం కంటే ఎక్కువ తగ్గే అవకాశం ఉండగా, ద్రవ్యోల్బణం 1 నుంచి 1.5 శాతం వరకు పెరిగే అవకాశముంది. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా కొన్ని పరిశ్రమలు, రెస్టారెంట్లు కార్యకలాపాలు తగ్గించుకోవడం వంటి మందగమన సంకేతాలు కనిపిస్తున్నాయని గుర్తు చేశారు.తక్షణ చర్యలుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తక్కువ ధరకు లభిస్తే అక్కడి నుంచి చమురు, గ్యాస్, ఎరువుల నిల్వలను యుద్ధ ప్రాతిపదికన సమీకరించాలని సూచించారు. ఎక్సైజ్ సుంకాల కోత, సబ్సిడీలు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయని, కానీ దీర్ఘకాలంలో ప్రభుత్వం ఈ భారాన్ని మోయలేక చివరికి వినియోగదారులపైనే ధరల భారం పడుతుందని పేర్కొన్నారు.భారీ అప్పులు, రూపాయి పతనం వంటి అంశాలు ఈ సంక్షోభాన్ని మరింత క్లిష్టం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్ని గుణపాఠంగా తీసుకుని శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ పునరుత్పాదక ఇంధనాలు, వ్యూహాత్మక నిల్వలు పెంచుకోవడమే దీర్ఘకాలిక పరిష్కారమని సూచించారు.

