నిబంధనల మేరకు అక్రిడిటేషన్ల మంజూరు
ఒత్తిళ్లను ఖాతరు చేయని పరిపాలన
వివాదాల నడుమ పారదర్శక నిర్ణయం
ఆర్థిక ఆరోపణలకు చెక్
కమిటీ వ్యవహారంలో స్పష్టత
రాతపూర్వక ప్రకటనతో పారదర్శకత
అర్హులకు నేరుగా దరఖాస్తు అవకాశం
విచక్షణాధికారాల వినియోగం
పాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం
జర్నలిస్టుల వర్గాల నుంచి ప్రశంసలు
కాకినాడ, పెన్ పవర్ ఫిబ్రవరి 25:
కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న షణ్మోహన్ సగిలికు ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎపియుడబ్ల్యూజె) అభినందనలు తెలియజేసింది. ఒత్తిళ్లను ఏమాత్రం లెక్కచేయకుండా నిబంధనల మేరకు అర్హులైన జర్నలిస్టులకు సకాలంలో అక్రిడిటేషన్లను మంజూరు చేసి జారీ చేస్తున్న ఆయన తీరు అభినందనీయమని యూనియన్ నాయకులు పేర్కొన్నారు.
ఈసారి జిల్లా అక్రెడిటేషన్ కమిటీ నియామకం నుంచి అక్రిడిటేషన్ల సిఫార్సుల వరకు పలు వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆర్థిక ఆరోపణలు కూడా వెలువడిన నేపథ్యంలో ఈ వ్యవహారం నేరుగా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. కొన్ని వర్గాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరించాలని ఒత్తిళ్లు తీసుకువచ్చినప్పటికీ, కలెక్టర్ పూర్తిగా నిబంధనలను పాటిస్తూ తన విచక్షణాధికారాల మేరకు తుది నిర్ణయం తీసుకోవడం విశేషమని యూనియన్ ప్రతినిధులు తెలిపారు.
అంతేకాక, ఈ అంశంపై రాతపూర్వక ప్రకటనను మీడియాకు విడుదల చేయడం ద్వారా పారదర్శకతను చాటుకున్నారని అన్నారు. అర్హులైన జర్నలిస్టులు నేరుగా దరఖాస్తు చేసుకుంటే అర్హతలను పరిశీలించి అక్రిడిటేషన్ జారీ చేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడం మరింత ముదావహమని పేర్కొన్నారు. ఇప్పటికే పాలనాపరంగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కలెక్టర్ షణ్మోహన్ సగిలి, దీర్ఘకాలంగా అక్రిడిటేషన్ల జారీలో వస్తున్న ఆర్థిక ఆరోపణలకు పుల్స్టాప్ పెట్టే దిశగా చర్యలు తీసుకోవడం ద్వారా ఈ రంగంలోనూ తనదైన ముద్రను వేస్తున్నారని యూనియన్ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎపియుడబ్ల్యూజె జిల్లా అధ్యక్షులు డి.ఎస్.ఆర్ ఆంజనేయులు (అంజిబాబు), జిల్లా కార్యదర్శి దేవవరపు కృష్ణార్జునరావు, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు కే. స్వాతి ప్రసాద్ కలెక్టర్ను అభినందించారు.



