పెన్ పవర్ ప్రత్యేక వార్త రంపచోడవరం:
అన్నవరం శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఉపాలయమైన శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తుల ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం “ఖడ్గమాల పూజ” పేరుతో నూతన ఆర్జిత సేవను ప్రారంభించారు. ఈ ప్రత్యేక పూజను ప్రతి శుక్రవారం ఉదయం 7.30 గంటల నుండి 8.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఈ పూజకు టికెట్ ధర రూ.1,116గా నిర్ణయించారు. ఒక టికెట్కు ఖడ్గమాల పూజలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కల్పించడంతో పాటు పలు ప్రసాదాలను అందజేస్తారు. కుంకుమ, శ్రీ అమ్మవారి ప్రతిమ, తామలపాకులు, పుష్పాలు, పోచెక్కలు, ఉగరబత్తులు, కంకణం, దేవస్థానం వారి విగ్రహ చిత్రం భక్తులకు అందజేయబడతాయి. అలాగే పూజలో ఉపయోగించిన కొబ్బరికాయను కూడా ప్రసాదంగా ఇస్తారు. అదనంగా స్వామివారి తీర్థప్రసాదంతో పాటు 250 గ్రాముల పులిహోర ప్రసాదాన్ని అందజేస్తారు.ఈ పవిత్ర ఖడ్గమాల పూజలో పాల్గొనడం ద్వారా శ్రీ వనదుర్గ అమ్మవారి అనుగ్రహం, ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు సకల శుభాలు కలుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులందరూ ఈ నూతన ఆర్జిత సేవలో పాల్గొని దివ్య కటాక్షానికి పాత్రులు కావాలని వారు కోరారు.



