హైదరాబాద్, పెన్ పవర్, మార్చి 23:
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో మరోసారి అక్రమ ఔషధాల ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. పాతబస్తీ చదర్ఘాట్లో పరిధిలో నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లను రహస్యంగా విక్రయిస్తున్న గుంపును చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఇటీవల టాస్క్ ఫోర్స్కు అందిన గోప్య స మాచారం ప్రకారం, కొందరు వ్యక్తులు నిషేధిత “మెఫెంటర్మైన్” స్టెరాయిడ్ ఇంజెక్షన్లను అక్రమంగా అమ్ముతున్నారని తెలిసింది. వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. కొద్ది రోజుల పాటు వారి కదలికలను గమనించిన అనంతరం, సరైన సమయాన్ని చూసి దాడి నిర్వహించారు. ఈ ఆపరేషన్లో ఓల్డ్ మలక్పేట్కు చెందిన షేక్ సమీర్, వసీం ఖాన్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, ఈ ఇంజెక్షన్లను ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా తెప్పించి, స్థానికంగా గుప్తంగా విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి 20 నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, 3 మొబైల్ ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్లలో మరిన్ని లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో ఇది చిన్న స్థాయి వ్యవహారం కాదని, పెద్ద నెట్వర్క్కు సంబంధించిన రాకెట్ కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని వ్యక్తుల పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసి, మిగతా నిందితులను పట్టుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వినియోగిస్తే ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.



