గంగవరం, పెన్ పవర్ ఏప్రిల్ 11: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన–2027లో భాగంగా గంగవరం మండలంలో మే 1 నుండి 31 వరకు మొదటి దశ జనగణన నిర్వహించనున్నట్లు సెన్సస్ చార్జ్ ఆఫీసర్, తాసిల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రక్రియ రెండు దశలలో జరుగనుండగా, మొదటి దశ మే నెలలో, రెండో దశ వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చి నెలల్లో చేపట్టనున్నారు.మొదటి దశలో ప్రతి ఇంటిని సందర్శించి ఇళ్లకు సంబంధించిన వివరాలు, కుటుంబ సభ్యుల ప్రాథమిక సమాచారం ఎన్యుమరేటర్లు ఆన్లైన్లో నమోదు చేస్తారు. రెండో దశలో ప్రతి వ్యక్తి పూర్తి వివరాలను సేకరించనున్నారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు మండలంలో 45 మంది ఎన్యుమరేటర్లు, 8 మంది సూపర్వైజర్లను నియమించారు. వీరికి ఈ నెల 15 నుండి 17 వరకు, అలాగే 21 నుండి 23 వరకు రెండు విడతలుగా మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇవ్వనున్నారు.మే నెలలో జరిగే జనగణనలో ప్రజలు అందుబాటులో ఉండి, ఎన్యుమరేటర్లకు అవసరమైన సమాచారం అందించి సహకరించాలని సెన్సస్ ఛార్జ్ ఆఫీసర్ మరియు తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు.

