జిల్లా జాయింట్ కలెక్టర్ స్మరణ రాజ్
గంగవరం, పెన్ పవర్ ,ఏప్రిల్ 8:
పోలవరం జిల్లాలో రైతులకు సాగునీరు సమృద్ధిగా అందించే దిశగా చెరువులు, చెక్డ్యామ్ల మరమ్మత్తులను వేగవంతం చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ తెలిపారు.బుధవారం గంగవరం మండలం గంగవరం గ్రామంలోని పెద్ద చెరువును ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “జలధార–జల హారతి” కార్యక్రమంలో భాగంగా నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆధ్వర్యంలో చెరువులు, చెక్డ్యామ్లకు అవసరమైన మరమ్మత్తులను చేపట్టి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నెల 6వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెరువులు, చెక్డ్యామ్లను గుర్తించి, గ్రామ సభల తీర్మానాల ఆధారంగా మరమ్మత్తులు చేపట్టి సాగునీటి సదుపాయాన్ని మెరుగుపరుస్తామని తెలిపారు. భూగర్భ జలాల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, సమగ్ర నీటి నిర్వహణ, చెరువులు–కాలువల పునరుద్ధరణ, నీటి సంరక్షణ నిర్మాణాలు, పచ్చదనం పెంపు, గ్రామ నీటి బడ్జెట్ అమలు వంటి అంశాలు ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏపిడీ ఎల్. రాంబాబు, ఎంపీడీవో లక్ష్మణ్, ఏపీవో ప్రకాష్, ఏఈ వెంకటరమణ, మాజీ ఎంపీపీ తీగల ప్రభ, మాజీ సర్పంచ్ బుల్లియమ్మ తదితరులు పాల్గొన్నారు.

