వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న కృషి చిరస్మరణీయం
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 16: సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం సర్దార్ గౌతు లచ్చన్న చేసిన కృషి చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అన్నారు.
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆదివారం గ్రీన్ పార్క్ హోటల్ జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా లచ్చన్న అందించిన సేవలను స్మరించుకున్నారు.
బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం లచ్చన్న చేసిన పోరాటం, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు. లచ్చన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, బీసీ సంఘాల నాయకులు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని సర్దార్ గౌతు లచ్చన్నకు నివాళులర్పించారు.

