రంపచోడవరం, పోలవరం జిల్లా పెన్ పవర్:
చిత్తూరు జిల్లా వి.కోటలో ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ జగన్మోహన్ను దారుణంగా హత్య చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై దాడిగా భావించబడుతూ ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి బి. సత్యనారాయణమూర్తి, మీడియా విభాగం అధ్యక్షుడు ఏ. వీరబాబు ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఘటన సమాజంలో భయాందోళనలు కలిగించడమే కాకుండా మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యగా పేర్కొన్నారు. జర్నలిస్టులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్టప్రకారం కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో జర్నలిస్టుల భద్రతను కట్టుదిట్టం చేసే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

