కన్యకాపరమేశ్వరి ఆలయంలో వైభవంగా శ్రావణమాస పూజలు

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 14: వన్టౌన్ కురుపాం మార్కెట్ ప్రాంతంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారు రజిత వస్త్రాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు అమ్మవారి బాలాలయంలో శుద్ధజలం, పాలు, పెరుగు, తేనె, గంధం, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్ల రసాలతో సహా 108 ద్రవ్యాలతో క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి రజిత వస్త్రాలంకరణతో పాటు 108 బంగారు పుష్పాలతో నివేదన సమర్పించారు.
దేవాలయ ప్రాంగణంలో మహిళలు సామూహికంగా లలితాసహస్రనామ పారాయణం నిర్వహించారు. దేవస్థాన ఆస్థాన పురోహితులు ఆర్.బి.బి. కుమారశర్మ నేతృత్వంలో శ్రీమహాలక్ష్మి దేవికి మహిళలచే సామూహిక లక్ష్మీసహస్ర కుంకుమార్చన నిర్వహించారు.
కార్యక్రమ వివరాలను దేవాలయ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆరిశెట్టి దినకర్, పెనుగొండ కామరాజు తెలిపారు. శ్రావణమాస ఉత్సవ కార్యనిర్వాహక సభ్యురాళ్లు కడిమిశెట్టి దంతేశ్వరి, కొత్తా లక్ష్మి, కొత్తా ఉమామహేశ్వరి పూజా కార్యక్రమాల గురించి వివరించారు.
క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు, సామూహిక పూజల్లో పాల్గొన్న మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన సంఘ కోశాధికారి దోమ వెంకట బాలాజీ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగా, అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

