స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డీసీఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 14:
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐ) ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని కార్పొరేట్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. హెల్పింగ్ హార్ట్స్, రోటరీ బ్లడ్ సెంటర్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీసీఐ ఉద్యోగులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
డీసీఐ ఎండీ, సీఈఓ కెప్టెన్ ఎస్. దివాకర్ శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం ఎంతో కీలకమని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.
శిబిరంలో సుమారు 26 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయగా, మొత్తం 30 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రక్తదానం చేసిన ఉద్యోగులు, సిబ్బందికి డీసీఐ ప్రతినిధులు ప్రశంసా పత్రాలను అందజేశారు.
భవిష్యత్తులోనూ సమాజ సంక్షేమానికి దోహదపడే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని డీసీఐ ప్రతినిధులు తెలిపారు.

