- చట్టబద్ధతతోనే రాజధాని శాశ్వతం అవుతుందనుకోవడం భ్రమే..!
- మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేసిన గత పాలన..!
- విశాఖ క్యాంప్ ఆఫీస్తో సమాంతర సచివాలయానికి బాటలు..!
- రూ.50 వేల కోట్ల ప్రాజెక్ట్ను అర్ధాంతరంగా ఆపేసిన నిర్ణయం..!
- పెట్టుబడిదారుల్లో అనిశ్చితి పెంచిన రాజధాని రాజకీయాలు..!
- రైతుల 34 వేల ఎకరాల త్యాగానికి రక్షణ కవచంగా అసెంబ్లీ తీర్మానం..!
- అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవమన్న పవన్ కళ్యాణ్..!
- ‘సైకో పాలన’తో ఐదేళ్లు రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్లిందన్న లోకేష్..!
- వైసీపీ గైర్హాజరు: ఆరోపణలకు సమాధానం చెప్పలేక సభ బహిష్కరణ..?
- రాజధాని మనుగడకు చట్టం కాదు, కమిట్మెంట్ ఉన్న నాయకత్వమే కీలకం..!
గుంటూరు, పెన్ పవర్ మార్చి 30:
రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు తీర్మానం చేసింది ఏపీ అసంబ్లీ. కేంద్రం కూడా విభజన చట్టంలో పెట్టేస్తుంది. అంత వరకూ బాగానే ఉంది. కానీ జగన్ సీఎం అయితే రాజధానిని మార్చలేరన్న ప్రచారం మాత్రం అవాస్తవం. మన దేశంలో అమలు చేసినవే చట్టాలు. అమలు చేయకూడదనుకుంటే..దాని కోసం పాలకులు ఎన్నో మార్గాలు వెదుకుతారు. రాజధాని విషయంలో చట్టబద్ధత ఉంటే ఇక మార్పు అసాధ్యం అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. వ్యవస్థలను ఎలా వాడుకోవాలో, చట్టాల్లోని లొసుగులను ఎలా వెతకాలో తెలిసిన పాలకులకు ఏదీ అసాధ్యం కాదు.విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చినంత మాత్రాన అది శాశ్వతం అయిపోదు. చట్టాలు అనేవి పాలనను క్రమబద్ధం చేయడానికి ఉంటాయి కానీ, పాలకుల పట్టుదలను అడ్డుకోలేవు. గతంలో మూడు రాజధానులు అనే ప్రతిపాదన తెచ్చినప్పుడు, అమరావతిని తీసేస్తున్నామని వారు ఎక్కడా చెప్పలేదు. కానీ, అభివృద్ధిని ఆపేయడం ద్వారా, నిధులను మళ్లించడం ద్వారా ఆ ప్రాంతాన్ని ఒక ఎడారిగా మార్చగలిగారు. అంటే, చట్టాన్ని మార్చకపోయినా, దాని ప్రాధాన్యతను తగ్గించే నిర్వీర్య ప్రక్రియ రాజకీయంగా చాలా సులభం.ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే అధికారం ఉంటుందనేది జగన్ చెప్పేమాట. విశాఖలోని రుషికొండపై నిర్మించిన భవనాలు కేవలం గెస్ట్ హౌస్లు మాత్రమే కావు, అవి ఒక సమాంతర సచివాలయానికి పునాదులు. చట్టం ప్రకారం రాజధాని అమరావతిలోనే ఉన్నా, క్యాంప్ ఆఫీస్ పేరుతో పాలకుడు విశాఖ నుంచే చక్రం తిప్పవచ్చు. జగన్ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తానని ప్రకటన చేసి.. సీఎంకాగానే రాజధాని నిర్మాణానికి అవసరమైన రూ. 50 వేల కోట్ల ప్రాజెక్టును అర్ధాంతరంగా ఆపేయడం, అంతర్జాతీయ సంస్థలైన వరల్డ్ బ్యాంక్ వంటి వాటిని వెనక్కి వెళ్లేలా చేశారు. తర్వాత సీఎం అయినా ఇలా చేయరన్న గ్యారంటీలేదు.రాజధాని అంటే కేవలం భవనాలు కాదు, అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ. ఐటీ కంపెనీలు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు అన్నీ నమ్మకం మీద ఆధారపడి వస్తాయి. పాలకుడు మారినప్పుడల్లా రాజధాని మారుతుందన్న భయం ఉంటే ఏ పెట్టుబడిదారుడూ ఏపీ వైపు చూడడు. యువతకు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే నిలకడైన పాలన, రాజధాని పట్ల స్పష్టమైన విజన్ ఉన్న నాయకత్వం అవసరం. గందరగోళం సృష్టించే ధోరణి ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే, చట్టం ఉన్నా లేకపోయినా అభివృద్ధి కుంటుపడుతుంది.అమరావతిని ఎవరూ మార్చలేరు అనే ధీమా మంచిదే. కానీ మార్చబోము .. అమరావతిని అభివృద్ధి చేస్తామని వైసీపీ ఇప్పటికీ ప్రకటించలేదు. ప్రకటించినా నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. రాజ్యాంగబద్ధంగా ఉన్న అధికారాలను వాడుకుని, వ్యవస్థలను మేనేజ్ చేసి, ఒక ప్రాంతాన్ని పనికిరాకుండా చేసే శక్తి అధికారంలో ఉన్న వారికి ఉంటుంది. ఆ పని గతంలో జగన్ చేశారు. వస్తే మళ్లీ చేస్తారు. రాజధాని మనుగడ అనేది కేవలం చట్టం మీద కాదు, ఆ చట్టాన్ని అమలు చేసే వ్యక్తి ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది. ఏపీ భవిష్యత్తు నిలవాలంటే, రాజధానిని ఒక సెంటిమెంట్ గా కాకుండా ‘కమిట్మెంట్’ గా భావించే నాయకత్వం కొనసాగాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చను ప్రారంభిస్తూ గత ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలనే సంకల్పంతో 34 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. కానీ, జగన్ మోహన్ రెడ్డి కేవలం రాజకీయ కక్షతో రాజధానిని స్మశానంగా మార్చారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ముసుగులో అమరావతిని అనాథను చేశారని, రైతులను రోడ్డున పడేసిన పాపం గత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు చేస్తున్న తీర్మానం అమరావతికి రక్షణ కవచంలా మారుతుందని భరోసా ఇచ్చారు.ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. అమరావతి అనేది కేవలం ఒక కులానికో, ప్రాంతానికో చెందింది కాదు.. అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం అని గర్జించారు. జగన్ సర్కార్ రాజధానిని చెరబట్టి రాష్ట్ర భవిష్యత్తును పదేళ్లు వెనక్కి నెట్టేసిందని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా పారిపోయారని, కనీసం తప్పు ఒప్పుకునే ధైర్యం కూడా వారికి లేదని ఎద్దేవా చేశారు. అమరావతిని వెలుగుల జిలుగుల నగరంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చాటిచెప్పారు.ఐదేళ్ల పాలనను సైకో పాలన గా నారా లోకేష్ అభివర్ణించారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక గ్రాఫిక్స్ అంటూ అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో బురదజల్లి, కోర్టుల చుట్టూ తిప్పి కాలయాపన చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు అమరావతికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడమే కాకుండా, చట్టబద్ధత కల్పించి ఏ శక్తీ అడ్డుకోలేని విధంగా అభివృద్ధి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో అమరావతి రైతులపై జరిగిన దాడులు, అక్రమ కేసులను అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. బీజేపీ సభ్యుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉందని, విభజన చట్టం సవరణ ద్వారా దీనికి మరింత బలం వస్తుందని పేర్కొన్నారు. విష్ణుకుమార్ రాజు వంటి నేతలు కూడా జగన్ ప్రభుత్వం చేసిన రాజధాని ద్రోహం ను అంకెలు, సాక్ష్యాలతో సహా వివరించారు.ఈ చర్చకు వైసీపీ హాజరుకాకపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. కూటమి నేతలు చేసిన తీవ్రమైన ఆరోపణలను తిప్పికొట్టే అవకాశం ఉన్నా, సభను బహిష్కరించడం ద్వారా వైసీపీ తన ఓటమి ని అంగీకరించినట్లయింది. తప్పు ఒప్పుకున్నట్లయింది.

